కరోనా ఎఫెక్ట్.. అన్నీ మాయం..!
ABN , First Publish Date - 2020-09-14T15:13:47+05:30 IST
కొవిడ్ పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ రంగంపై ఆధారపడ్డ వారందరూ తీవ్రంగా నష్టపోయారని ఫెయిత్ కన్సల్టింగ్ సీఈవో ఆశీష్ గుప్తా లాంటి వారు
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి) : కొవిడ్ పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ రంగంపై ఆధారపడ్డ వారందరూ తీవ్రంగా నష్టపోయారని ఫెయిత్ కన్సల్టింగ్ సీఈవో ఆశీష్ గుప్తా లాంటి వారు చెబుతుంటే, నాస్కామ్ లాంటి సంస్థలు కొవిడ్-19తో 70% స్టార్టప్స్ ప్రభావితమయ్యాయని వెల్లడిస్తున్నాయి. హోటల్స్లో అతిథులు లేరు, జూమ్ మీటింగ్లు పెరిగిన తర్వాత వ్యాపార పర్యటనలు మాయమైపోయాయి. ఇవన్నీ పర్యాటక రంగంపై తీవ్రంగా ప్రభావితం చూపిస్తున్నాయంటున్నారు టూర్ ఆపరేటర్లు. ఆరు నెలలుగా అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధాలు కొనసాగుతుండటంతో పాటుగా దేశీయం గానూ రైళ్లు, బస్సులు సరిగా తిరగక పోవడంతో పర్యాటకానికి అవకాశం లేదని చెబుతున్నారు ఫెయిత్ ప్రతినిధులు. పర్యాటక రంగం కుదేలు కావడానికి భయమే అతి పెద్ద కారణ మంటూ భద్రత, ఆరోగ్యం, పరిశుభ్రత, బ్రాండ్స్, విలువ అనే అంశాలకు డిమాండ్ పెరుగుతోందని, కరోనా అనంతర కాలంలో ఇవే కీలకం కానున్నాయంటున్నారు కాక్స్ అండ్ కింగ్స్ ప్రతినిధి ప్రకాష్తో పాటుగా థ్రిలోఫిలియా ప్రతినిధి అగర్వాల్. పర్యాటక రంగంలో ధోరణులు ఏ విధంగా ఉండబోతున్నాయన్న అంచనాలను వారు ఈ విధంగా వెల్లడించారు...
- లాంగ్ వీకెండ్ వస్తే చాలు చలో థాయ్ లేదంటే సింగపూర్ అనే వారు ఇకపై కనిపించకపోవచ్చు. ఆఖరకు గోవా బీచ్లకు సైతం ఆచితూచి వెళ్తారు.
- కొంత కాలంగా ట్రెండ్ పరిశీలిస్తే సీనియర్ సిటిజన్లు యాత్రలకు వెళ్తుండటం గణనీయంగా కనిపించింది. ఇకపై అలా ఉండకపోవచ్చు.
- కొన్నాళ్ల పాటు మతపరమైన పర్యటనలు తగ్గనున్నాయన్నది అంచనా.
- బృందాలుగా యాత్రలు చేయడం కొంతకాలం కనిపించకపోవచ్చు. ఎట్లీస్ట్, వ్యాక్సిన్ వచ్చే వరకూ! అలాగని కుటుంబ యాత్రలు లేకుండా మాత్రం ఉండవు.
- పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను సురక్షితంగా భావించే అవకాశాలు లేవు. దీంతో రోడ్డు మార్గాల ద్వారానే కరావాన్ ట్రిప్పులకు డిమాండ్ పెరగవచ్చు. కూర్గ్, రిషికేష్, హంపి లాంటి ప్రాంతాలకు ఈ తరహా టూర్లు ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయట. కొవిడ్ అనంతర కాలంలో ప్రకృతి అందాల కోసమంటూ గ్రామీణ ప్రాంతాలను సందర్శించడం పెరగొచ్చు.