కరోనా భయం..5న జిల్లాలో 123 మందికి పాజిటివ్
ABN , First Publish Date - 2020-08-07T05:43:36+05:30 IST
కరోనా వైరస్ ప్రజలను వణికిస్తోంది. రోజురోజుకు పెరుగుతున్న కేసులతో ప్రజలు భయం..
ఐదుగురు మృత్యువాత
కరీంనగర్లో ముగ్గురు...హైదరాబాద్లో ఇద్దరు
రెండు వేలు దాటిన బాధితుల సంఖ్య
కరీంనగర్, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కరోనా వైరస్ ప్రజలను వణికిస్తోంది. రోజురోజుకు పెరుగుతున్న కేసులతో ప్రజలు భయం..భయంగా జీవనం సాగిస్తున్నారు. జిల్లాలో ఈనెల 5న 123 మందికి కరోనా వ్యాధి సోకినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్లో వెల్లడించింది. దీంతో జిల్లాలో వ్యాధిబారినపడ్డవారి సంఖ్య 2,041కు పెరిగింది. 6న కూడా ఇంచుమించు అదే స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదైనట్లు స్థానికుల సమాచారం మేరకు తెలుస్తున్నది. గురువారం జిల్లా ఆస్పత్రిలో ఒకరు, ప్రైవేట్ హాస్పిటల్లో మరొకరు, హుస్సేనిపురాలో ఇంకొకరు మొత్తం ముగ్గురు కరోనాతో మృతిచెందారు.
హైదరాబాద్లోచికిత్స పొందుతూ మరో ఇద్దరు మరణించారు. గురువారం హుజురాబాద్లో 24 మందికి, జమ్మికుంటలో 16 మందికి, వీణవంక మండలంలో ఒకరికి, ఇల్లందకుంటలో ఐదుగురికి, సైదాపూర్లో ఒకరికి, శంకరపట్నం మండలంలో ఒకరికి కరోనా వ్యాధి నిర్ధారణ అయినట్లు తెలిసింది. చొప్పదండిలో ఐదుగురికి, తిమ్మాపూర్లో ఒకరికి, మానకొండూర్లో ఒకరికి కరోనా వైరస్ సోకింది. కరీంనగర్లోని వివిధ డివిజన్లలో 26 మంది కోవిడ్ బారిన పడి కొందరు హాస్పిటల్స్లో మరికొందరు హోంఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు. ఓవైపు మరణాల సంఖ్య మరోవైపు పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంతో జిల్లా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.