కరోనా బాధితునికి పైప్ లేని ఆక్సిజన్ మాస్క్... భార్య ఎదుటే మృతి!
ABN , First Publish Date - 2021-04-19T13:01:13+05:30 IST
మధ్యప్రదేశ్లోని రత్లాం మెడికల్ కాలేజీలో...
రత్లాం: మధ్యప్రదేశ్లోని రత్లాం మెడికల్ కాలేజీలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఒక వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆసుపత్రిలోని ఐసీయూలో చేరిన ఆ వృద్ధునికి ఆక్సిజన్ మాస్క్ పెట్టినప్పటికీ, ఆ మాస్క్కు ఆక్సిజన్ అందించే పైప్ను జతచేయలేదు. ఫలితంగా ఆక్సిజన్ అందక ఆ వృద్ధుడు మృతి చెందాడు. భర్త తన కళ్లముందే మృతి చెందడాన్ని తట్టుకోలేక పోయిన అతని భార్య కొద్దిసేపటికే మృతి చెందింది.
ఈ సందర్భంగా ఆ వృద్ధ దంపతుల అల్లుడు హిమాంశు జోషి మాట్లాడుతూ తన మామ రాజ్ కుమార్ దీక్షిత్, అత్త... కరోనాతో బాధపడుతూ ఏప్రిల్ 12న ఆసుపత్రిలో చేరారని, వారి ఆరోగ్యం విషమించడంతో వారికి ఆక్సిజన్ పెట్టారని తెలిపారు. రెండు రోజుల క్రితం తన అత్త నుంచి ఫోన్ వచ్చిందని, ఆసుపత్రిలో పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పిందన్నారు. తన మామకు ఆక్సిజన్ మాస్క్ పెట్టినప్పటికీ దానికి పైప్ అతికించ లేదని తెలిపారు. ఈ కారణంగానే అతను మృతి చెందాడని, అతని భార్య కూడా కొద్దిసేపటికే కన్నుమూసిందన్నారు. తన మామ మృతికి ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. కాగా ఉదంతంపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.