కరోనా జాగ్రత్తలు పాటించాలి : డీఐజీ
ABN , First Publish Date - 2021-04-17T05:33:00+05:30 IST
ఉత్తరాంధ్ర జిల్లాల్లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పోలీసులు, అధికారులు, సిబ్బంది జ్రాగత్తలు పాటించాలని విశాఖ రేంజ్ డీఐజీ ఎల్కేవీ రంగారావు సూచించారు.
విజయనగరం క్రైం, ఏప్రిల్ 16: ఉత్తరాంధ్ర జిల్లాల్లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పోలీసులు, అధికారులు, సిబ్బంది జ్రాగత్తలు పాటించాలని విశాఖ రేంజ్ డీఐజీ ఎల్కేవీ రంగారావు సూచించారు. శుక్రవారం విజయనగరం, విశాఖ జిల్లాల పోలీసు అధికారులతో జూమ్ వీడి యో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బహిరంగ ప్రదేశాల్లో కచ్చితంగా భౌతిక దూరం పాటించాలని, తరుచుగా చేతులను శానిటైజర్, సబ్బుతో శుభ్ర పరుచుకోవాలని తెలిపారు. పోలీసు సిబ్బంది వారి కుటుంబ సభ్యులకు వైరస్ సోకినట్టయితే, సహాయం కోసం పోలీసు హెల్ప్లైన్కు ఫోన్ చేసి సాయం పొందాలన్నారు. రానున్న రెండు మూడు నెలల్లో వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని చెప్పారు. ప్రతిఒక్కరూ కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. రెండు డోస్లు వేసుకున్నప్పటికీ, జాగ్రత్తలు పాటించడంలో నిర్లక్ష్యం వహించొద్దన్నారు. కరోనా నియంత్రణ, రహదారి ప్రమాదాల నివారణ, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. పోలీసుల అత్యవసర నెంబర్లు తెలియజేసే విధంగా ప్రధాన కూడళ్లల్లో తస్మాత్ జాగ్రత్త పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలన్నారు.