రాజన్న క్షేత్రంలో కరోనా ఆంక్షలు

ABN , First Publish Date - 2021-04-18T05:12:59+05:30 IST

రాష్ట్రంలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానంలో కరోనా ఆంక్షలు మొదలయ్యాయి. ఆదివారం నుంచి ఐదు రోజులపాటు అన్ని రకాల దర్శనాలు, ఆర్జిత సేవలను రద్దు చేస్తూ ఆలయ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

రాజన్న క్షేత్రంలో కరోనా ఆంక్షలు
ఆలయ ప్రధాన ద్వారం ఎదుట ఏర్పాటు చేసిన బారికేడ్లు

- నేటి నుంచి ఐదు రోజులపాటు దర్శనం రద్దు

- భక్తులు లోపలికి ప్రవేశించకుండా బారికేడ్ల ఏర్పాటు

- ఆలయంలోనే సీతారాముల కల్యాణం

వేములవాడ, ఏప్రిల్‌ 17 : రాష్ట్రంలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రమైన వేములవాడ  రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానంలో కరోనా ఆంక్షలు మొదలయ్యాయి.  ఆదివారం నుంచి ఐదు రోజులపాటు అన్ని రకాల దర్శనాలు, ఆర్జిత సేవలను రద్దు చేస్తూ ఆలయ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. భక్తులు ఆలయంలోకి ప్రవేశించకుండా ప్రధాన ద్వారం వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ఉధృతి తీవ్రంగా ఉండడంతో భక్తుల ఆరోగ్య రక్షణ దృష్ట్యా ఉన్నతాధికారుల సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా 18వ తేదీ ఆదివారం నుంచి 22వ తేదీ గురువారం వరకు భక్తులు  రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకోవడానికి వీలు కాదు. సర్వదర్శనంతోపాటు కోడెమొక్కు, స్వామివారి కల్యాణం వంటి అన్ని రకాల ఆర్జిత సేవల రద్దు నేపథ్యంలో భక్తులు ఆలయంలోకి రాకుండా తగిన బందోబస్తు ఏర్పాటు చేశారు. శ్రీరామనవమి సందర్భంగా ఈ నెల 21వ తేదీ బుధవారం  సీతారామచంద్రస్వామివారి కల్యాణం నిర్వహించాల్సి ఉంది. ప్రతీ సంవత్సరం వేములవాడ క్షేత్రంలో సీతారామచంద్రస్వామివారి కల్యాణ వేడుక నిర్వహిస్తారు. ఈ వేడుకకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్ష మందికిపైగా భక్తులు హాజరవుతుంటారు. కొవిడ్‌  రెండో దశ ఉధృతి తీవ్రంగా ఉన్న కారణంగా భక్తజనం తాకిడిని తట్టుకునేందుకు స్వామివారల దర్శనాన్ని, ఆలయంలోకి ప్రవేశాన్ని రద్దు చేశారు. కాగా సీతారాముల కల్యాణోత్సవాన్ని భక్తులు లేకుండా ఆలయం లోపల అంతరంగికంగా నిరాడంబరంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఆలయం లోపలికి ప్రవేశం లేనందున భక్తులు వేములవాడకు రావద్దని ఆలయ అధికారులు కోరారు. కోడెమొక్కు, ఇతర ఆర్జిత సేవలు టీఎస్‌ మీసేవ లేదా టీ యాప్‌ ఫోలియో ద్వారా సేవల రుసుము చెల్లించి బుకింగ్‌ చేసుకుంటే భక్తుల గోత్ర నామాలపై పూజలు నిర్వహిస్తామని తెలిపారు. 

Updated Date - 2021-04-18T05:12:59+05:30 IST