జిల్లా ప్రభుత్వ వైద్య కాలేజీల్లోనూ కరోనా సేవలు: ఈటల
ABN , First Publish Date - 2020-07-07T07:39:41+05:30 IST
జిల్లా ప్రభుత్వ వైద్య కాలేజీల్లోనూ కరోనా సేవలు: ఈటల
హైదరాబాద్, జూలై 6(ఆంధ్రజ్యోతి) : జిల్లాల్లోని ప్రభుత్వ వైద్య విద్య కళాశాలల్లో పూర్తి స్థాయిలో కరోనా చికిత్స అందించాలని వైద్య విద్య సంచాలకుడిని మంత్రి ఈటల రాజేందర్ ఆదేశించారు. తక్కువ లక్షణాలున్న వారందరికి జిల్లా ఆస్పత్రుల్లో చికిత్స అందించాలని సూచించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఆస్పత్రులలో కరోనా పాజిటివ్ కేసులకు చికిత్స అందిస్తున్న నేపథ్యంలో అక్కడ ఉన్న అవసరాలు, సమస్యలపై ఆస్పత్రి సూపరింటెండెంట్లతో సోమవారం మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వైరస్ నిర్థారణ అయి, లక్షణాలు లేనివారిని హోమ్ ఐసోలేషన్లో ఉంచాలని మంత్రి ఆదేశించారు. ఆస్పత్రుల్లో ఏ కొరత ఉండకుండా చూసుకోవాలన్నారు. ఏ సమస్య ఉన్నా, అవసరాలున్నా వెంటనే తమ దృష్టికి తీసుకువస్తే ఒక్క రోజులో పరిష్కరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. గాంధీ ఆస్పత్రిలో రోగులకు నర్సులు అన్నం తినిపిస్తున్నారని, అలాంటి మానవత్వం ఇప్పుడు అవసరమన్నారు. మహబూబ్నగర్ సూపరింటెండెంట్ జిల్లా ఆస్పత్రి క్వార్టర్స్లోనే ఉండి అందుబాటులో ఉంటున్నందుకు మంత్రి ఆయనను ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా ఆస్పత్రుల సూపరింటెండెంట్లందరూ జిల్లా కేంద్రంలోనే ఉండాలని ఆదేశించారు.