మావోయిస్టులకు కరోనా లక్షణాలు
ABN , First Publish Date - 2021-05-11T04:51:15+05:30 IST
విశాఖ ఏజెన్సీలో పలువురు మావోయిస్టులకు కరోనా లక్షణాలు వున్నట్టు తమకు సమాచారం వుందని ఎస్పీ బొడ్డేపల్లి కృష్ణారావు ఒక ప్రకటన ద్వారా తెలిపారు.
ఉచితంగా వైద్యం అందిస్తాం
జిల్లా ఎస్పీ బొడ్డేపల్లి కృష్ణారావు ప్రకటన
విశాఖపట్నం, మే 10 (ఆంధ్రజ్యోతి): విశాఖ ఏజెన్సీలో పలువురు మావోయిస్టులకు కరోనా లక్షణాలు వున్నట్టు తమకు సమాచారం వుందని ఎస్పీ బొడ్డేపల్లి కృష్ణారావు ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఏవోబీ పరిధిలోని గాలికొండ, కోరుకొండ, పెదబయలు, కటాఫ్ ఏరియా దళాలకు చెందిన దళ సభ్యులు, మిలీషియా సభ్యులు కరోనాతో బాధపడుతున్నట్టు నిఘా వర్గాల ద్వారా తెలిసిందన్నారు. పలువురు మావోయిస్టులు జ్వరం, దగ్గు, ఆయాసం, తదితర సమస్యలతో బాధపడుతున్నారన్నారు. కొవిడ్ బారినపడిన మావోయిస్టులకు ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఇందుకు సంబంధించి కుటుంబ సభ్యులు, బంధువులు, రాజకీయ పార్టీల ప్రతినిధుల ద్వారా సంబంధిత పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించాలని సూచించారు. కరోనా బారినపడిన మావోయిస్టులకు వైద్య సేవలు అందిస్తామని, కోలుకున్న వెంటనే తిరిగి ఇళ్లకు వెళ్లిపోవచ్చునన్నారు. ఆ తరువాత తమ వైపు నుంచి ఎటువంటి ఇబ్బందులు వుండబోవని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సమయంలో ప్రాణం కంటే ఏదీ మిన్న కాదన్నారు.