గంటన్నరలోనే కరోనా నిర్ధారణ
ABN , First Publish Date - 2020-09-29T08:12:57+05:30 IST
కరోనా వైరస్ సోకిందో? లేదో? ఇక గంటన్నర వ్యవధిలోనే తెలుసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన సరికొత్త ఆర్టీపీసీఆర్ కిట్ను బెంగళూరు నగరానికి చెందిన స్టార్టప్ కంపెనీ ఈక్విన్ బయోటెక్ అభివృద్ధి చేసింది...
- కిట్ను రూపొందించిన బెంగళూరు కంపెనీ
బెంగళూరు, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్ సోకిందో? లేదో? ఇక గంటన్నర వ్యవధిలోనే తెలుసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన సరికొత్త ఆర్టీపీసీఆర్ కిట్ను బెంగళూరు నగరానికి చెందిన స్టార్టప్ కంపెనీ ఈక్విన్ బయోటెక్ అభివృద్ధి చేసింది. ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఆర్టీపీసీఆర్ కిట్లతో కరోనా నిర్ధారణకు 4-8 గంటల సమయం పడుతోంది. అందువల్లే అధికంగా యాంటీజెన్ పరీక్షలను నిర్వహిస్తున్నారు. పరీక్ష సమయంతో పాటు ఖర్చును కూడా తగ్గించే దిశగా తమ సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ శాస్త్రవేత్తలతో కలిసి పరిశోధనలు నిర్వహించిందని ఈక్విన్ బయోటెక్ అధినేత ఉత్పాల్ చెప్పారు. బెంగళూరులో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నూతన కిట్లతో ఫలితాలు 100 శాతం నిక్కచ్చిగా ఉంటున్నాయని చెప్పారు. ఈ కిట్లకు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) కూడా అనుమతి మంజూరు చేసిందన్నారు.