కరోనా వేళ.. జన జాతరేల?
ABN , First Publish Date - 2021-06-24T06:24:39+05:30 IST
కరోనా నేపథ్యంలో కర్ఫ్యూ నిబంధనలను ప్రభుత్వం సడలించింది. కానీ, భౌతిక దూరం, కరోనా జాగ్రత్తలు పాటించాలని స్పష్టంచేసింది.
తిరుపతి(రవాణా), జూన్ 23: కరోనా నేపథ్యంలో కర్ఫ్యూ నిబంధనలను ప్రభుత్వం సడలించింది. కానీ, భౌతిక దూరం, కరోనా జాగ్రత్తలు పాటించాలని స్పష్టంచేసింది. జిల్లాలోనూ అధికారికంగా పాజిటివ్ కేసులు 500 వరకు వస్తూనే ఉన్నాయి. మంగళ, బుధవారాల్లో 8 మంది కొవిడ్తో మృతిచెందారు. ఇలాంటి సమయంలో జగనన్న లేఅవుట్లో ఇళ్ల స్థలాల పంపిణీ, నిర్మాణాలకు భూమి పూజ పేరిట వేలాది మందితో సభ పెట్టడం విమర్శలకు తావిచ్చింది. వడమాలపేట మండలం కల్లూరు గ్రామపంచాయతీలోని 77 ఎకరాల్లో 3671 మంది తిరుపతివాసులకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయించింది. అందులో 1,765 మందికి జియో ట్యాగ్ ద్వారా ఇళ్లస్థలాలను కేటాయిస్తూ, ఇళ్ల నిర్మాణానికి బుధవారం ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తిరుపతి నుంచి భారీగా లబ్ధిదారులను ఒకచోటికి చేర్చడం విమర్శలకు తావిచ్చింది. కరోనా నేపథ్యంలో ఇలా చేయడం ఎంతవరకు సబబని పలువురు ప్రశ్నిస్తున్నారు. కాగా, ఈ సమావేశంలో ఎమ్మెల్యే భూమన మాట్లాడుతూ.. మహిళాభివద్దే ధ్యేయంగా సీఎం జగన్ పని చేస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలను వివరించారు. ఎవరికైనా ఇల్లు రాకుంటే సంబంధిత సచివాలయాల్లో సంప్రదించి వివరాలను ఇస్తే వచ్చేలా చూస్తామని కమిషనర్ గిరీష తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ శిరీష, డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ, పలువురు కార్పొరేటర్లు, డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళీశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.