బయట తిరగొద్దన్నందుకు.. చెరువులోకి దూకిన కరోనా బాధితుడు
ABN , First Publish Date - 2021-04-23T11:00:42+05:30 IST
బయట తిరగవద్దని కుటుంబ సభ్యులు మందలించటంతో.. కరోనా సోకిన ఓ వృద్ధుడు మనస్తాపంతో చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
కుటుంబసభ్యులు మందలించడంతో ఆత్మహత్య
కరోనా లేకున్నా పాజిటివ్గా నివేదిక ఇచ్చారు
మంగళగిరి సమీపంలో కార్పొరేట్ ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలని మరో బాధితుడి డిమాండ్
గన్నవరం/మంగళగిరి, ఏప్రిల్ 22: బయట తిరగవద్దని కుటుంబ సభ్యులు మందలించటంతో.. కరోనా సోకిన ఓ వృద్ధుడు మనస్తాపంతో చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కృష్ణా జిల్లా గన్నవరం మండల మర్లపాలెంలో ఈ విషాదకర సంఘటన జరిగింది. 74 ఏళ్ల వృద్ధుడికి మూడు రోజుల క్రితం కరోనా పాజిటివ్గా వచ్చింది. దీంతో ఇంట్లోనే ఉంటూ మందులు వాడుతున్నాడు. బయట తిరగవద్దని కుటుంబ సభ్యులు మందలించడంతో బుధవారం రాత్రి ఆయన స్థానిక చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు.
చెరువు ఒడ్డున ఆయన ఫోన్, చేతి కర్ర, చెప్పులు, వాచి ఉండటంతో చెరువులోకి దూకినట్లు నిర్ధారించుకున్నారు. కరోనా సోకిన వ్యక్తి చెరువులో దూకడంతో గ్రామస్తులు భయాందోళన చెందారు. మృతదేహాన్ని బయటకు తీసేందుకు అందరూ నిరాకరించారు. గురువారం మృతదేహం పైకి తేలడంతో కుటుంబ సభ్యులే బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం గన్నవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు.
మానసిక క్షోభకు గురిచేశారు
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజ గ్రామానికి చెందిన కంకణాల శివశంకర్ ఈ నెల 20న ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకున్నారు. మంగళగిరి సమీపంలోని ఒక కార్పొరేట్ ఆస్పత్రి సిబ్బంది పాజిటివ్గా నిర్థారించి నివేదిక ఇచ్చారు. కాగా శివశంకర్ ఆ మరుసటి రోజున గుంటూరులోని ఓ వైద్యశాలకు వెళ్లి సీటీ స్కాన్, ఇతర కొవిడ్ పరీక్షలు చేయించుకున్నారు. అక్కడ నిర్వహించిన పరీక్షలలో కరోనా లేదని నివేదిక వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్యశాఖ నుంచి అదే విధంగా ఫోన్కు మెసేజ్ కూడా వచ్చింది. తనకు కరోనా లేకున్నా ఉన్నట్టుగా ఇచ్చి, తీవ్ర క్షోభకు గురి చేసిన వైద్యశాలపై చర్యలు తీసుకోవాలని శివశంకర్ కోరారు.