సిద్దిపేట జిల్లాలో ఐదుగురికి కరోనాపాజిటివ్
ABN , First Publish Date - 2020-07-14T10:44:07+05:30 IST
సిద్దిపేట జిల్లాలో సోమవారం ఐదు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకరు ఆశావర్కర్ భర్త కాగా మరొకరు
సిద్దిపేట, జూలై 13: సిద్దిపేట జిల్లాలో సోమవారం ఐదు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకరు ఆశావర్కర్ భర్త కాగా మరొకరు హైదరాబాద్లోని ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేసే ల్యాబ్ టెక్నిషియన్ ఉన్నారు. జిల్లాలో కేసుల సంఖ్య పెరుగుతుండడంతో అనుమానితులందరి శాంపిల్స్ సేకరిస్తున్నారు.
సోమవారం 53 శాంపిల్స్ సేకరించారు. చేర్యాల మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఆశావర్కర్ భర్తకు పాజిటివ్గా తేలింది. కొండపాక మండలం అంకిరెడ్డిపల్లికి చెందిన ఒకరు హైదరాబాద్లోని ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేసే ల్యాబ్ టెక్నిషియన్గా పనిచేస్తూ కరోనా బారిన పడ్డాడు. గతంలో ఇదే ఆస్పత్రిలో పనిచేసే మరో ల్యాబ్ టెక్నిషియన్కు పాజిటివ్గా తేలింది. సిద్దిపేటలోని గణేశ్నగర్కు చెందిన రిటైర్డ్ ఉద్యోగికి, సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరుకు చెందిన ఒక వృద్ధుడికి, దుబ్బాకకు చెందిన ఒక రాజకీయ పార్టీ నేతకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు.
చేర్యాలలో ఫర్టిలైజర్ వ్యాపారికి..
చేర్యాల పట్టణానికి చెందిన ఓ ఫర్టిలైజర్ వ్యాపారికి కరోనా నిర్ధారణ అయినట్లు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి వైద్యాధికారి అశ్వినిస్వాతి, హెల్త్ ఎడ్యూకేటర్ మురళి తెలిపారు. నాలుగు రోజులక్రితం అస్వస్థతకు గురైన ఆయన సికింద్రాబాదు యశోద ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోగా, కరోనా నిర్ధారణ కావడంతో జిల్లా అధికారులకు తెలిపారు. వారి ఆదేశానుసారం పాజిటివ్ వ్యక్తి కుటుంబసభ్యులందరినీ హోంక్వారంటైన్లో ఉండాలని సూచించారు. ప్రైమరీ కాంటాక్టులను గుర్తించి స్వీయనిర్భంధంలో ఉండాలని తెలిపారు.