కుమారుని కరోనా చికిత్స కోసం తల్లి ఆత్మహత్య బెదిరింపు... అయినా...
ABN , First Publish Date - 2020-07-12T16:32:50+05:30 IST
కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. మన దేశంలోనూ వైరస్ అంతకంతకూ విజృంభిస్తుండగా, దాని బారిన పడినవారందరికీ వైద్య చికిత్స అందని పరిస్థితులున్నాయి. ఇటువంటి ఉదంతమొకటి...
కోల్కతా: కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. మన దేశంలోనూ వైరస్ అంతకంతకూ విజృంభిస్తుండగా, దాని బారిన పడినవారందరికీ వైద్య చికిత్స అందని పరిస్థితులున్నాయి. ఇటువంటి ఉదంతమొకటి కోల్కతాలో చోటుచేసుకుంది. కరోనా బారినపడిన 12వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి తగిన వైద్యం అందక కన్నుమూశాడు. బాధితుడిని మూడు ఆసుపత్రులలో చేర్చుకోవడానికి నిరాకరించడంతో, ఆ విద్యార్థి తల్లి తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో, నాల్గవ ఆసుపత్రిలో బాధితుడిని చేర్చుకున్నారు. వివరాల్లోకి వెళితే సుబ్రాజిత్ చటోపాధ్యాయ(18) డయాబెటిస్తో బాధపడుతున్నాడు. తాజాగా అతనికి కరోనా సోకింది. దీంతో కుటుంబ సభ్యులు మూడు ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. ఎక్కడా బాధితుడిని చేర్చుకోలేదు. దీంతో బాధితుని తల్లి కోల్కతా మెడికల్ కాలేజీకి చేరుకుని, తన కుమారునికి చికిత్స అందించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. దీంతో ఆ ఆసుపత్రిలో బాధితుడిని చేర్చుకున్నారు. అయితే సుబ్రాజిత్ అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సందర్భంగా మృతుని తండ్రి మాట్లాడుతూ తమ కుమారునికి సకాలంలో వైద్యం అందలేదని, కోల్కతా మెడికల్ కాలేజీలోనూ సిబ్బంది నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు.