నగర పాలికెలలో నమ్మ క్లినిక్లు
ABN , First Publish Date - 2022-07-03T16:25:54+05:30 IST
రాష్ట్రంలోని అన్ని నగర పాలక సంస్థల్లో నమ్మక్లినిక్లను ప్రారంభించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంత్రివర్గంలో తీర్మానించారు.
- కొత్తగా 438 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు
- రూ.103.73 కోట్ల కేటాయింపు
బెంగళూరు, జూలై 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అన్ని నగర పాలక సంస్థల్లో నమ్మక్లినిక్లను ప్రారంభించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంత్రివర్గంలో తీర్మానించారు. నమ్మక్లినిక్ల పేరిట 438 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలను తెరవనున్నారు. ప్రస్తుత బడ్జెట్లో రూ.103.73 కోట్లు ‘నమ్మ క్లినిక్’ల కోసం ఖర్చు చేయనున్నారు. 15వ ఆర్థిక సంఘంలో భాగంగా గ్రాంట్లను వినియోగించుకుని నమ్మ క్లినిక్లు ఏర్పాటు చేస్తారు. బెంగళూరు నగరంలోని 243 వార్డులతోపాటు రా ష్ట్రంలోని అన్ని నగర పాలిక సంస్థల్లోనూ ఈ క్లినిక్లు తెరుస్తారు. సీజనల్ వ్యాధులతోపాటు దీర్ఘకాలిక జబ్బులను గుర్తించే సదుపాయాన్ని ఏర్పాటు చేస్తారు. సీజనల్ వ్యాధుల నియంత్రణ ద్వారా నగర ప్రదేశాలలోనే ఇతర ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గించాలని భావిస్తున్నారు. ఈ క్లినిక్లలో 438 మంది డాక్టర్లను నియమించాలని నిర్ణయించారు. ఆసుపత్రులకు అనుగుణంగా నర్సులు, సహాయకులు, డీ గ్రూప్ సిబ్బందిని వెంటనే నియమిస్తారు. దేశ రాజధాని ఢిల్లీలో ‘మొహల్లా క్లినిక్’లు విజయవంతంగా సాగుతుండడంపై అటువంటి ఆసుపత్రులు బెంగళూరులో ఏర్పాటు చేయాలనే ప్రస్తావన గడిచిన నాలుగేళ్లుగా సాగుతోంది. మొహల్లా క్లినిక్లలో సాధారణం నుంచి దీర్ఘకాల వ్యాధులకు చికిత్స అందిస్తారు. అటువంటి ప్రక్రియతోనే నమ్మ క్లినిక్లు పనిచేయనున్నాయి.