Temporary teachers: కార్పొరేషన్ స్కూళ్లలో తాత్కాలిక టీచర్లు
ABN , First Publish Date - 2022-07-31T13:16:03+05:30 IST
నగర కార్పొరేషన్ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీర్చేందుకు త్వరలో 500 మంది తాత్కాళిక ఉపాధ్యాయులను(Temporary teachers)
- కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం
- అన్నాడీఎంకే వాకౌట్
చెన్నై, జూలై 30 (ఆంధ్రజ్యోతి): నగర కార్పొరేషన్ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీర్చేందుకు త్వరలో 500 మంది తాత్కాళిక ఉపాధ్యాయులను(Temporary teachers) నియమించాలని కార్పొరేషన్ పాలకవర్గం నిర్ణయించింది. శనివారం ఉదయం రిప్పన్భవనంలో జరిగిన మేయర్(Mayor) ప్రియ అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరిగింది. సమావేశం ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాల సమయంలో కౌన్సిలర్లు తాము వార్డులోని సమస్యలను పరిష్కరించాలని కోరారు. ముఖ్యంగా నగరంలో వాననీటి కాల్వల నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయని, వాటిని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. వాననీటి కాల్వల నిర్మాణాన్ని పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin) స్వయంగా చర్యలు చేపడుతున్నారని, ఆ మేరకు ప్రతి జోన్లోను ఈ పనులను పరిశీలించడానికి గాను సీనియర్ ఐఏఎస్ అధికారులను కూడా నియమించారని కమిషనర్ గగన్దీప్సింగ్(Gagandeep Singh) బేదీ చెప్పారు. ప్రస్తుతం వాననీటి కాల్వల నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని తెలిపారు. కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రత్యేక ఆహ్వానితులుగా వస్తే వారిని ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు అనుమతించాలని డీఎంకే కౌన్సిలర్ ధనశేఖరన్ కోరారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు కార్పొరేషన్ సమావేశంలో పాల్గొని ప్రసంగించేందుకు ఎలాంటి అభ్యంతరాలు లేవని, వీలైతే వారి నియోజకవర్గం అభివృద్ధి నిధులతో కార్పొరేషన్కు సంబంధించిన పనులు కూడా చేపట్టవచ్చని మేయర్ ప్రియ వివరించారు. అనంతరం సమావేశంలో 98 తీర్మానాలను ఆమోదించారు. ముఖ్యంగా కార్పొరేషన్ పాఠశాల్లో 500 మంది తాత్కాలిక ఉపాధ్యాయులను నియమించడానికి అనువుగా వారి జీతాలను విద్యావిభాగం ఉన్నత కమిటీ, తల్లిదండ్రులు(parents) కమిటీ కలిసి నిర్ణయించేలా తీర్మానం చేసి ఆమోదించారు. సమావేశంలో డిప్యూటీ మేయర్ మహే్షకుమార్, కమిషనర్ గగన్ దీ్ప సింగ్ బేదీ, వివిధ పార్టీలకు చెందిన కౌన్సిలర్లు పాల్గొన్నారు.
అన్నాడీఎంకే కౌన్సిలర్ల నిరసన కౌన్సిల్ సమావేశం ప్రారంభం కాగానే అన్నాడీఎంకే సభాపక్షనాయకుడు కేపీకే సతీష్కుమార్ మాట్లాడుతూ కార్పొరేషన్ పరిధిలో ఆస్తిపన్ను పెంపు రెట్టింపు చేయడం, డీఎంకే ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంచడాన్ని ఖండిస్తూ తమ పార్టీ సభ్యులు వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ మేరకు 15 మంది అన్నాడీఎంకే సభ్యులు కౌన్సిల్ సమావేశం నుంచి వాకౌట్ చేశారు. ఆ తర్వాత ప్లకార్డులను పట్టుకుని, ఆస్తి పన్ను తగ్గించాలని, విద్యుత్ ఛార్జీలు పెంచకూడదని డీఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.