రాష్ట్రంలో దౌర్జన్యం, అవినీతి పాలన
ABN , First Publish Date - 2021-07-29T17:59:49+05:30 IST
రాష్ట్రంలో అవినీతి, దౌర్జన్య పాలన సాగుతోందని..
సోమిశెట్టి వెంకటేశ్వర్లు ధ్వజం
దేవినేని ఉమపై దాడికి యత్నించడం హేయమని టీడీపీ నాయకుల ఆగ్రహం
కర్నూలు: రాష్ట్రంలో అవినీతి, దౌర్జన్య పాలన సాగుతోందని, ప్రజలు తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని టీడీపీ కర్నూలు లోక్సభ నియోజకవర్గ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు హెచ్చరించారు. కర్నూలు నగరంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అక్రమ మైనింగ్ గురించి తెలుసుకొనేందుకు దేవినేని ఉమామహేశ్వరరావుతోపాటు మరికొందరు టీడీపీ నాయకులు ఆ ప్రాంతానికి వెళ్లే ప్రయత్నాలు చేస్తుండగా దాడికి యత్నించడందారుణమన్నారు. పోలీసు అధికారులు నిందితులపై కాకుండా బాధితులపైనే కేసులు బనాయించడం దారుణమని అన్నారు. రాష్ట్రంలో రెండేళ్ల నుంచి భూకబ్జాలు, అక్రమ మైనింగ్, మద్యం మాఫియా తదితర అవినీతి, అక్రమాలు పేట్రేగిపోతున్నాయని, అయితే సీఎం జగన్ పల్లెత్తుమాట అనడం లేదని అన్నారు. టీడీపీ నాయకులు నాగేంద్ర కుమార్, అబ్బాస్, కొరకంచి రవికుమార్, మంచాలకట్ట భాస్కర్రెడ్డి, జేమ్స్, తదితరులు పాల్గొన్నారు.
కల్లూరు: అవినీతి అక్రమాలను ప్రశ్నించే ప్రతిపక్ష నాయకులపై దాడులు చేయించి.. వారిపై కేసులు పెట్టడం దారుణమని టీడీపీ నంద్యాల లోక్సభ నియోజకవర్గ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత మండిపడ్డారు. బుధవారం మాధవీనగర్లోని వారు తమ స్వగృహంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైసీపీ నేతల అక్రమ మైనింగ్ను వెలికి తీసేందుకు వెళ్లిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కారుపై వైసీపీ గుండాలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నిందితులను వదిలేసి బాధితులైన దేవినేని ఉమను అరెస్టు చేయడం అప్రజాస్వామికం అని అన్నారు. చివరకు వైసీపీ నేతలు రాష్ట్రంలోని చెరువులు, గుట్టలు, చివరకు శ్మశానాలను వదలకుండా దోచుకుంటున్నారని ఆరోపించారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు శాఖ విఫలమైందని ఆరోపించారు.
పత్తికొండ: మాజీమంత్రి ఉమామహేశ్వరావుపై వైసీపీ కార్యకర్తల దాడికి యత్నించడం అమానుషమని టీడీపీ పత్తికొండ నియోజకవర్గ ఇన్చార్జి కేఈ శ్యాంబాబు అన్నారు. బుధవారం ఆయన ఆంధ్రజ్యోతితో ఫోన్లో మాట్లాడారు. వందలమంది వైసీపీ కార్యకర్తలు రాళ్లు, కర్రలతో దేవినేనిపై దాడికి యత్నించడంతో పాటు అడ్డుపడ్డ టీడీపీ నాయకుల కార్యకర్తలను చితకబాదడం రాష్ట్రంలో వైసీపీ పాలన నిరంకుశ వైఖరికి నిదర్శనమన్నారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
తుగ్గలి: కొండపల్లి రిజర్వాయర్ ఫారెస్టులో అక్రమంగా మైనింగ్ చేస్తున్నారని పనుల పరిశీలనకు వెళ్లిన మాజీ మంత్రి దేవినేని ఉమా వాహనంపై వైసీపీ వర్గీయులు దాడులు చేయడం అమానుషమని టీడీపీ మండల అధ్యక్ష, ఉపాధ్యక్షుడు తిరుపాలునాయుడు, వెంకటరాముడుచౌదరి అన్నారు. బుధవారం తుగ్గలిలో వారు విలేకరులతో మాట్లాడారు. పనుల పరిశీలనకు వెళ్లిన వారిపై దాడులు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.