ఛీఛీఐ
ABN , First Publish Date - 2020-12-02T06:03:22+05:30 IST
ఆర్భాటంగా కొనుగోలు ప్రారంభిస్తున్న బయ్యర్ 90 శాతం వరకూ బోరేలను తిరస్కరిస్తూ రైతులను కంటతడి పెట్టిస్తున్నాడు.
నిబంధనల పేరుతో పత్తి కొనుగోలు చేయని సీసీఐ
90 శాతం బోరేలు తిరస్కరణ
12 రోజుల్లో వెయ్యి బోరేలే కొనుగోలు
నందిగామ, డిసెంబరు 1: ఆర్ అన్న ఆంగ్ల పదం పత్తి రైతుల వెన్నులో వణుకుపుట్టిస్తోంది. ఆంగ్ల పదానికి, పత్తి రైతుకు సంబందం ఏమిటని ఆలోచిస్తున్నారా..? నందిగామ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన సీసీఐ కొనుగోలు కేంద్రంలో బయ్యర్ ఆర్ అన్న ఆంగ్ల పదాన్ని ఎక్కువగా వినియోగిస్తున్నాడు. ఆర్ అనగా రిజక్ట్(తిరస్కరణ). ఆర్భాటంగా కొనుగోలు ప్రారంభిస్తున్న బయ్యర్ 90 శాతం వరకూ బోరేలను తిరస్కరిస్తూ రైతులను కంటతడి పెట్టిస్తున్నాడు. ఈ ఏడాది ఆరంభం నుంచి పత్తి రైతు ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాడు. అల్పపీడనాల వల్ల భారీ వర్షాలు కురవడంతో పత్తి పూర్తిగా దెబ్బతిన్నది. భారీ వర్షాల వల్ల పత్తి నాణ్యత కోల్పోయింది. మొక్కలలో ధాతువుల లోపం ఏర్పడడం, కలుపు భారీగా పెరగడంతోపాటు పూత, కాత దశలో ఉండగా పది రోజల పాటు ఎడతెరపి లేకుండా వర్షాలు పడ్డాయి. 90 శాతం పంట దెబ్బతిన్నది. చేతికి వచ్చిన పంట కూడా దెబ్బతిన్నది. గతంతో పోలిస్తే నాలుగో వంత దిగుబడులు కూడా రాని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో సీసీఐ కొనుగోలు కేంద్రం ప్రారంభించడంతో అన్నదాతలకు స్వాంతన చేకూరింది. పత్తి బోరేలతో రైతులు సీసీఐ కొనుగోలు కేంద్రానికి వచ్చారు. నిబంధనల పేరుతో సీసీఐ అధికారులు పత్తిని తిరస్కరిస్తున్నారు.
నవంబరు 19వ తేదీన సీసీఐ కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకూ కేవలం వెయ్యి బోరేలను మాత్రమే అధికారులు కొన్నారు. గ్రామాల నుంచి ఆటోలు, ట్రాక్టర్లపై యార్డుకు తెచ్చిన పత్తిని అధికారులు తిరస్కరించడంతో రైతులు కుంగిపోతున్నారు. ఏం చేయలేక బోరేలపై నిస్సహాయంగా కూర్చొని ఆవేదన చెందుతున్నారు.
ప్రారంభించి.. పత్తాలేని ఎమ్మెల్యే..
కొనుగోలు కేంద్రం ప్రారంభం రోజున శాసన సభ్యుడు డాక్టర్ మొండితోక జగన్మోహనరావు సమక్షంలో ఒక్క రోజే 800 బోరేలు కొనుగోలు చేసిన అధికారులు ఆ తరువాత కొనుగోళ్లు తగ్గించారు. నిత్యం పదుల సంఖ్యలో బోరేలు కొంటూ మిగిలిన వాటిని తిస్కరిస్తున్నారు. ఇప్పటి వరకూ ఎమ్మెల్యే పట్టించుకోలేదు.
రైతులకు అండగా ఉద్యమిస్తాం
- మాజీ ఎమ్మెల్యే సౌమ్య
మంగళవారం సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన మాజీ శాసన సభ్యురాలు తంగిరాల సౌమ్య రైతుల దుస్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి సీసీఐ అధికారులతో సంప్రదింపులు జరపాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పత్తి రైతులకు అండగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.