కాటన్కు ధాన్యాభిషేకం
ABN , First Publish Date - 2022-05-16T06:31:19+05:30 IST
ఉభయ గోదావరి జిల్లాలు నేడు సస్యశ్యామలంగా ఉన్నాయంటే కారణం ఎవరు కాటన్.. ప్రతి ఒక్కరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఐదు వేళ్లు నోటిలోకి వెళుతున్నాయంటే కారణం కాటన్..
కడియం, మే 15 : ఉభయ గోదావరి జిల్లాలు నేడు సస్యశ్యామలంగా ఉన్నాయంటే కారణం ఎవరు కాటన్.. ప్రతి ఒక్కరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఐదు వేళ్లు నోటిలోకి వెళుతున్నాయంటే కారణం కాటన్.. బీడువారిన భూములకు సుజల ధారను ప్రసాదించి.. ఉభయగోదావరి జిల్లాల ప్రజల ఆకలిని తీర్చారు. చరిత్రలో మహనీయుడుగా మిగిలిపోయారు.అందుకే ఆయన లేకున్నా.. నేటికీ పూజిస్తున్నారు.. పాలభిషేకాలు, పుష్పాభిషేకాలు చేస్తున్నారు. కడియం మండలం దుళ్ళకు చెందిన ఉత్తమ రైతు అవార్డు గ్రహీత సత్తి భాస్కరరెడ్డి (కందరెడ్డి) మాత్రం వినూత్నంగా ఆలోచించారు. కాటన్ జయంతిని పురస్కరించుకుని ఆదివారం దుళ్ళలో కందరెడ్డి తన ఇంటి ముందు 2004లో ఏర్పాటు చేసిన నిలువెత్తు కాటన్ విగ్రహానికి వేదపండితుల ఆశీర్వచనాలతో ధాన్యాభిషేకం..పాలభిషేకం చేశారు.. పట్టు వస్త్రాలు సమర్పించారు. గోదావరి జిల్లాలను సశ్యశ్యామలం చేసిన ఘనత కాటన్దే అన్నారు. ఇక్కడ పండే ప్రతి ధాన్యం గింజ ఆయన పుణ్యమేనన్నారు.