పత్తి ధరహాసం!
ABN , First Publish Date - 2022-05-18T05:39:00+05:30 IST
ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి ధరలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. రికార్డు స్థాయిలో పత్తి ధర పలికింది.
క్వింటా రూ.13,555
ఆదోని(అగ్రికల్చర్) మే 17: ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి ధరలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. రికార్డు స్థాయిలో పత్తి ధర పలికింది. మంగళవారం పత్తి క్వింటాలు గరిష్ఠంగా రూ.13,555 పలికింది. దేశంలోని ఏ ఇతర మార్కెట్ యార్డులోనూ ఈ ధరలు పలకడం లేదని వ్యాపారులు పేర్కొంటున్నారు. రైతులు నిల్వ ఉంచుకున్న పత్తి అంతా విక్రయించుకున్నారు. వచ్చే ఖరీఫ్ సీజనలో వ్యవసాయ పెట్టుబడి ఖర్చుల కోసం రైతులు దాచుకున్న పత్తిని విక్రయించుకుంటున్నారు. మార్కెట్లో పత్తి దిగుబడులు విక్రయానికి రావడం.. తగ్గిపోవడం... జిన్నింగ్ పరిశ్రమలకు అవసరమైన పత్తి లేకపోవడంతో వ్యాపారులు పోటీ పడి కొనుగోలు చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో దూది ధరలు, పత్తిగింజల ధ రలు పెరగడంతో స్థానిక మార్కెట్లో పెరగడానికి కూడా కారణమైంది. 333 క్వింటాళ్ల పత్తి విక్రయానికి రాగా... క్వింటాలు కనిష్ఠ ధర రూ.7,211, గరిష్ఠ ధర రూ.13,555, మధ్య ధర రూ.11,777గా పలికింది.