Varun Gandhi: మోదీజీ...ఈ గుంతలేంటి?
ABN , First Publish Date - 2022-07-22T23:45:44+05:30 IST
సొంత పార్టీపై విమర్శలు చేయడంలో ఏమాత్రం వెనుకాడని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ తాజాగా..
న్యూఢిల్లీ: సొంత పార్టీపై విమర్శలు చేయడంలో ఏమాత్రం వెనుకాడని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ (Varun Gandhi) తాజాగా మరోసారి ఉత్తరప్రదేశ్లోని ఎక్స్ప్రెస్వే (Expressway) దుస్థితిపై ఒక వీడియో షేర్ చేశారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ గత వారంలోనే ఈ ఎక్స్ప్రెస్వేను ప్రారంభించారు. ఇంతలోనే వర్షాలకు హైవే గుంతలు పడటంతో ట్విట్టర్ వేదకగా ఆ వీడియోను ఆయన పోస్ట్ చేశారు. హైవై నాణ్యతను ప్రశ్నించారు. అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు.
''రూ.15,000 కోట్లతో నిర్మించిన ఎక్స్ప్రెస్వే ఐదు రోజుల వర్షాల కూడా తట్టుకోలేకపోతే దాని నాణ్యతపై తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతాయి'' అని ఆయన హిందీలో ట్వీట్ చేసారు. 296 కిలోమీటర్ల ఎక్స్ప్రెస్వేను ప్రధానమంత్రి మోదీ ఈ నెల 16న ప్రారంభించారు. చిత్రకూట్లోని భరత్కూప్ నుంచి ఇటావాలోని కుంద్రెల్ను కలిపే నాలుగు లైన్ల హైవే ఇది. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా జలౌన్ జిల్లా సమీపంలో ఈ ఎక్స్ప్రెస్వే కుంగి కొన్ని చోట్ల గుంతలు పడ్డాయి.
దీనిపై వరుణ్గాంధీ ట్వీట్ చేస్తూ, సంబంధిత అధికారాలు, కంపెనీలపై చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రాజెక్టు హెడ్, ఇంజనీరు, బాధ్యులైన కంపెనీలకు సమన్లు పంపాలని అన్నారు. కాగా, రోడ్లుపై ఎక్కడెక్కడ గుంతలు పడ్డాయో అక్కడ తక్షణం బుల్డోజర్లు రప్పించి మరమత్తు పనులు చేపట్టామని, ట్రాఫిక్కు అంతరాయం లేకుండా చేశామని అధికారి ఒకరు తెలిపారు.
సమాజ్వాదీ, కాంగ్రెస్ విమర్శలు
మోదీ ప్రారంభించిన ఎక్స్ప్రెస్హైవే పలు చోట్ల గుంతలు పడటంపై సమాజ్వాదీ పార్టీ, యూపీ కాంగ్రెస్ విమర్శలు గుప్పించాయి. బీజేపీ సగం సగం ప్రేమతో చేపట్టిన అభివృద్ధి పనుల నాణ్యతకు ఇది ఒక ఉదాహరణ మాత్రమేనని సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఎద్దేవా చేశారు. యూపీలో గుంతలే లేకుండా చేస్తామంటూ ఘనంగా ప్రకటించకున్న పెద్దలు బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్వే ప్రారంభించిన నాలుగు రోజులకే దెబ్బతినడానికి ఏమి సమాధానం చెబుతారని కాంగ్రెస్ పార్టీ నిలదీసింది.