60 అడుగుల లోతైన బోరుబావిలో.. 106 గంటల పాటు మృత్యువుతో పోరాటం.. ఈ బాలుడు ఎలా బయటపడ్డాడంటే..
ABN , First Publish Date - 2022-06-15T18:05:40+05:30 IST
ఛత్తీస్గఢ్లోని చంపా జిల్లాలో 60 అడుగుల లోతైన బోరుబావిలో పడిపోయిన బాలుడు రాహుల్ సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు.
ఛత్తీస్గఢ్లోని చంపా జిల్లాలో 60 అడుగుల లోతైన బోరుబావిలో పడిపోయిన బాలుడు రాహుల్ సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు. దాదాపు 106 గంటల ప్రయత్నం తర్వాత మంగళవారం అర్ధరాత్రి ఆ చిన్నారిని బయటకు తీశారు. వెంటనే, ఆ బాలుడిని బిలాస్పూర్లోని అపోలో ఆసుపత్రిలో చేర్చారు. ఇది దేశంలోనే అతిపెద్ద రెస్క్యూ ఆపరేషన్ అని చెబుతున్నారు. ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ రెస్క్యూ ఆపరేషన్ను నిరంతరం పర్యవేక్షించారు. బాలుడు సురక్షితంగా బయటపడడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి..
ఇంగ్లీష్లో 35, లెక్కల్లో 36.. వైరల్ అవుతున్న కలెక్టర్ పదో తరగతి మార్కుల లిస్ట్!
శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో రాహుల్ 60 అడుగుల లోతున్న బోరుబావిలో పడిపోయాడు. సమాచారం అందుకున్న ప్రభుత్వం ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సైన్యాన్ని రంగంలోకి దించింది. దాదాపు 106 గంటల పాటు ఈ ఆపరేషన్ నిరాటంకంగా సాగింది. కాగా, ఆ సమయంలో బోరుబావిలోకి ఒక పాము కూడా వచ్చింది. అయితే పెద్దగా ఇబ్బంది ఎదురుకాలేదు. బోరుబావిలో రాహుల్పై ప్రత్యేక కెమెరాలతో నిఘా పెట్టారు. అతనికి ఆహారం, నీరు అందించారు. ఆ బాలుడితో నిరంతరం ఎవరో ఒకరు మాట్లాడేవారు.
సైనికులు తొలుత బోర్వెల్ వద్దకు చేరుకుని సొరంగం తవ్వారు. డ్రిల్లింగ్ మెషిన్తో కాకుండా చేతితోనే ఆ సొరంగం తవ్వారు. దాని ద్వారా రాహుల్ వద్దకు చేరుకున్నారు. అనంతరం రాహుల్ను తాడుతో లాగి బయటకు తీసుకొచ్చారు. నేరుగా అంబులెన్స్ వద్దకు తీసుకెళ్లి హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం రాహుల్ ఆరోగ్యం సురక్షితంగా ఉంది.