బరి కొట్టారు!
ABN , First Publish Date - 2022-01-15T06:38:25+05:30 IST
సంక్రాంతి పర్వదినాలు ప్రారంభమైన తొలిరోజే జిల్లాలో జూదక్రీడల జాతర శుక్రవారం హోరెత్తిపోయింది. ఎక్కడికక్కడే కోడిపందేలు, గుండాటలు, పేకాట పోటీలను పెద్దసంఖ్యలో ప్రజలు తిలకించారు. జిల్లావ్యాప్తంగా వందకు పైగా ఏర్పడ్డ కోడిపందేల బరులలో తొలిరోజు రూ.25 కోట్ల మధ్య చేతులు మారినట్టు సమాచారం.
- జిల్లాలో తొలిరోజు హోరెత్తిన జూదక్రీడల జాతర
- రూ.25 కోట్లకుపైనే పందేలు
- రూ.కోట్లలో గుండాటలు, పేకాటలు
- షరా ‘మామూలు’గానే పోలీసు యంత్రాంగం
- కులాలు, పార్టీలవారీగా బరులు
- పందెం బరులను ప్రారంభించిన ఎమ్మెల్యేలు
- తిలకించిన ప్రముఖులు, బుల్లితెర నటులు
(అమలాపురం-ఆంధ్రజ్యోతి)
సంక్రాంతి పర్వదినాలు ప్రారంభమైన తొలిరోజే జిల్లాలో జూదక్రీడల జాతర శుక్రవారం హోరెత్తిపోయింది. ఎక్కడికక్కడే కోడిపందేలు, గుండాటలు, పేకాట పోటీలను పెద్దసంఖ్యలో ప్రజలు తిలకించారు. జిల్లావ్యాప్తంగా వందకు పైగా ఏర్పడ్డ కోడిపందేల బరులలో తొలిరోజు రూ.25 కోట్ల మధ్య చేతులు మారినట్టు సమాచారం. కోడిపందేల ప్రాంగణ ప్రాంతాల్లో గుం డాటల నిర్వహణదారులు లక్షలాది రూపాయలు వేలం పాటలు పాడుకుని బహిరంగంగా బోర్డులు నిర్వహిస్తున్నారు. కొన్నిచోట్ల కులాలు, రాజకీయ పార్టీలవారీగా పందెం బరులను ఏర్పాటుచేశారు. అధికార వైసీపీకి చెందిన కీలక ప్రజాప్రతినిధులు పందెం బరులను లాంచ నంగా ప్రారంభించారు. వైసీపీకి చెందిన ద్వితీయశ్రేణి నాయకుల సమక్షంలోనే పలుచోట్ల పందేలు జరిగాయి. సాయంత్రం నుంచి కోనసీమలో వర్షం కురవడంతో పందేలకు ఆటంకం ఏర్పడింది. వైసీపీ, టీడీపీతో సహా రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖ నేతలు, టీవీ యాం కర్లు, కమెడియన్లు పాల్గొని పందేలను వీక్షించారు. జిల్లాలోని కాకినాడ, రాజమహేంద్రవరం గ్రామీణ ప్రాంతాలతోపాటు కోనసీమ వ్యాప్తంగా వందలాది ప్రాంతాల్లో కోడిపందేలు, గుండా టలు, పేకాటలు జరిగాయి. కాట్రేనికోన మండలం దొంతికుర్రు-పల్లంకుర్రు మధ్య జిల్లాలోనే మెగా బరిలో పందేలు హోరెత్తాయి. ఇరవైకుపైగా పందేలు తొలిరోజు జరిగాయి. ఒక్కో పందెం రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు సాగింది. ఈ పందేల్లో ఉభయ రాష్ర్టాలకు చెందిన కీలక నేతలు పాల్గొన్నారు. ఈ బరి వద్ద డబ్బులు లెక్కించేందుకు ప్రత్యేక కౌంటింగ్ మిషన్లు కూడా ఏర్పాటు చేశారు. టీడీపీకి చెందిన దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దగ్గరుండి కోడిపందేలు ఆడించారు. ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమా ర్తోపాటు టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు పందేలను వీక్షించారు. ఈ పందేల్లో విజేతలైన వారికి వెండి నాణేలను బహుమతులుగా అందజేశారు. వందలాది సంఖ్యలో కార్లు హాజరు కావడంతో పల్లంకుర్రు వెళ్లే రోడ్డు కిక్కిరిసిపోయింది. గుండాటలు భారీగా సాగాయి. పి.గన్నవరం మండలంలో ఏడు ప్రాంతాల్లో కోడిపందేలు జరిగాయి. ప్రభు త్వ విప్, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథా రిటీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డిలు రావులపాలెంలో కోడిపందేలు బరిని ప్రారంభించారు. కొత్తపేటలో ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ప్రారంభించారు. అంబాజీపేట మండలం పోతాయిలంకలో బరిని ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు తనయుడు విశాల్ ప్రారంభించి పోటీల్లో పాల్గొన్నారు. అనపర్తి మండలం దుప్పలపూడిలో అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి కోడి పందేలు ప్రారంభించారు. పి.గన్నవరం నియోజకవర్గంలో పలు బరులను ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు సోదరుడు వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ప్రధానంగా కాట్రేనికోన మండలం గెద్దనపల్లి, చెయ్యేరు సహా పలు గ్రామాల్లో, ఉప్పలగుప్తం మండలం చినగాడవిల్లి, ఎస్. యానాం, భీమనపల్లి, చల్లపల్లి గ్రామాల్లో కోడిపందేలు, గుండాటలు హోరెత్తాయి. అల్లవరం సడక్రోడ్డు, కోడూరుపాడు పరిధిలో పాటివారిపాలెం, గుబ్బలవారిపాలెం, దేవగుప్తం, గోడి, రెల్లుగడ్డ గ్రామాల్లో కోడిపందేలు జరిగాయి. అదేవిధంగా ముమ్మిడివరం మండలం రాజు పాలెం, పల్లిపాలెం, గేదెల్లంక, అన్నంపల్లి, కొత్తలంక, క్రాపచింతలపూడి, ఆత్రేయపురం మం డలంలోని బొబ్బర్లంక, వెలిచేరు, వద్దిపర్రు, ర్యాలి, లొల్ల గ్రామాల్లోను, ఐ.పోలవరం మండ లంలో మురమళ్ల, కొమరగిరి, జి.వేమవరంలోను, కొత్తపేట గ్రామంలోను, రావులపాలెం, రావులపాడు, వెదిరేశ్వరం తదితర గ్రామాల్లోను పి.గన్నవరం సహా ఏడు గ్రామాల్లోను, మలికి పురం మండలంలో మలికిపురం, రామరాజులంక, అమలాపురం రూరల్ మండలం వన్నె చింతలపూడి, సమనస, సవరప్పాలెం, తాండవపల్లి, చిందాడగరువు, ఇందుపల్లిలోని రెండు చోట్ల, అమలాపురం పట్టణంలో వై-జంక్షన్, ఎత్తురోడ్డు వద్ద పందెం బరులను ఏర్పాటు చేశారు. అంబాజీపేట మండలంలో నందంపూడి వెళ్లే రోడ్డులోను, పోతవరం, సఖినేటిపల్లి మండలం సఖినేటిపల్లి, వీవీ మెరక, గొంది, కేశవదాసుపాలెం, మోరి తదితర గ్రామాల్లో కోడి పందేలు, గుండాటలు హోరెత్తిపోతున్నాయి. వందలాది గుండాటల బోర్డులతో కోట్ల రూపా యల మేర చేతులు మారాయి. కాగా మలికిపురం మండలం తూర్పుపాలెంలో రికార్డింగు డ్యాన్సులు ఆడేండుకు వచ్చిన డ్యాన్సర్లను మలికిపురం ఎస్ఐ హరికోటిశాస్ర్తి అడ్డగించి వారిని స్టేషన్కు తీసుకువెళ్లారు. తాటిపాకలో డ్యాన్సు ప్రోగ్రాం ఏర్పాటు చేసేందుకు వేసిన స్టేజ్ను పోలీసులు తొలగించారు. అమలాపురం రూరల్ మండలం సమనసలో జనసేన, వైసీపీ బరులుగా రెండు బరులుగా ఏర్పాటు అవ్వడంతో రూరల్ ఎస్ఐ అందే పరదేశీ జనసేన బరి నిర్వాహకులను అదుపులోకి తీసుకుని పందేలను ఆపేయడంతో వివాదం తలెత్తింది. కాగా బుల్లితెర నటి తులసి, ప్రొడక్షన్ మేనేజర్ బాలులు వన్నెచింతలపూడిలోను పందేలు తిలకిం చగా అంతర్వేదిలో నటుడు ఫిష్ వెంకట్ గుండాటలు ఆడారు. పందెం బరుల వద్ద తిను బండారాల స్టాల్స్, చికెన్ పకోడి స్టాల్స్ కళకళ లాడాయి. కొన్నిచోట్ల మద్యం బెల్టుషాపులను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. కోనసీమ వ్యాప్తంగా పలుచోట్ల ప్రభల తీర్థాల నేపథ్యం లో రికార్డింగ్ డ్యాన్సులు నిర్వహించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినప్పటికీ అక్కడక్కడా పోలీసులు అడ్డుకుంటున్నట్టు సమాచారం.