పీసీఆర్ టెస్టు విషయమై ఒమన్ కీలక ప్రకటన !
ABN , First Publish Date - 2021-05-28T15:43:49+05:30 IST
మహమ్మారి కరోనా వ్యాప్తి కట్టడి కోసం గల్ఫ్ దేశాలు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు దేశాలు అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం విధించాయి. అలాగే పీసీఆర్ టెస్టు నెగెటివ్ సర్టిఫికేట్ కూడా తప్పనిసరి చేశాయి.
మస్కట్: మహమ్మారి కరోనా వ్యాప్తి కట్టడి కోసం గల్ఫ్ దేశాలు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు దేశాలు అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం విధించాయి. అలాగే పీసీఆర్ టెస్టు నెగెటివ్ సర్టిఫికేట్ కూడా తప్పనిసరి చేశాయి. ఈ క్రమంలో పీసీఆర్ టెస్టు విషయమై తాజాగా ఒమన్ సివిల్ ఏవియేషన్ అథారిటీ కీలక ప్రకటన చేసింది. విదేశాల నుంచి ఒమన్ వచ్చే ప్రయాణికులను రెండు కేటగిరీలుగా విభజించిన సివిల్ ఏవియేషన్ అథారిటీ.. సుదూర అంతర్జాతీయ విమానాల్లో ఒమన్ వచ్చే ప్రయాణికులు జర్నీకి 96 గంటల ముందు తీసుకున్న పీసీఆర్ టెస్టు నెగెటివ్ రిపోర్టు మాత్రమే చెల్లుబాటు అవుతుందని తెలిపింది. అలాగే షార్ట్ డిస్టెన్స్ విమానాల్లో ఒమన్ వచ్చే ప్రయాణికులు ప్రయాణానికి 72 గంటల ముందు చేయించుకున్న పీసీఆర్ టెస్టు నెగెటివ్ రిపోర్టు మాత్రమే చెల్లుతుందని పేర్కొంది. ఇక విదేశాల నుంచి ఒమన్ వచ్చే ప్రతి ఒక్కరికీ ఏడు రోజుల క్వారంటైన్ తప్పనిసరి. ఒమన్ పౌరులు, విమాన సిబ్బంది, 18 ఏళ్ల కంటే తక్కువ వయసు గల వారికి దీని నుంచి మినహాయింపు ఇచ్చింది.
ఒమన్లో ప్రవేశంలేని దేశాలివే..
కరోనా కల్లోలం కొనసాగుతున్న నేపథ్యంలో ఒమన్ ప్రస్తుతం పలు దేశాల ప్రయాణికుల రాకపై నిషేధం విధించింది. ఈ జాబితాలో భారత్ కూడా ఉంది. ఇండియాతో పాటు సుడాన్, లెబనాన్, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, నైజీరియా, టాంజానియా, ఘనా, గినియా, సియెర్రా లియోన్, ఇథియోపియా, బ్రిటన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఈ జాబితాలో ఉన్నాయి.