నైట్ కర్ఫ్యూ విధిస్తే సరిపోదు.. ప్రభుత్వానికి హైకోర్టు అక్షింతలు

ABN , First Publish Date - 2021-04-23T22:54:08+05:30 IST

కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై విచారించిన హైకోర్టు...

నైట్ కర్ఫ్యూ విధిస్తే సరిపోదు.. ప్రభుత్వానికి హైకోర్టు అక్షింతలు

హైదరాబాద్: కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై విచారించిన హైకోర్టు... ప్రభుత్వానికి అక్షింతలు వేయడంతోపాటు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్ లక్షణాలను ఆధారంగా చేసుకుని హాస్పిటల్‌లో అడ్మిట్ చెలుకోవాలని హైకోర్టు సూచించింది. ఆర్టీపీసీఆర్ టెస్టులు రోజుకు 30 నుంచి 40 వేల టెస్టులు చేస్తున్నామని ప్రభుత్వం తెలపగా..  ఏప్రిల్ 1 నుంచి ఇప్పటి వరకు 3 లక్షలు 47 వేలు మాత్రమే టెస్టులు చేశారని.. లెక్కలు ప్రకారం 8 లక్షల 40 వేలు చేయాలి కదా అని నిలదీసింది. పరీక్షలు ఎందుకు చేయడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. ఆర్టీపీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ లేకున్నా ప్రతి హాస్పిటల్‌లో అడ్మిషన్ ఇవ్వాలని ఆదేశించింది. కరోనా కేసులు వివరాలను ప్రతి రోజూ మీడియా బులెటిన్ విడుదల చేయాలని తెలిపింది. యాదాద్రి భువనగిరి, నిర్మల్, జగిత్యాల, కామారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి చాలా కేసులు నమోదు అవుతున్నాయని, కాబట్టి ఈ ప్రాంతాలలో టెస్టులు పెంచాలని సూచించింది. వలస కార్మికులు ఇబ్బందులు పడకుండా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని పేర్కొంది. 


కోవిడ్ నియంత్రణకు ప్రత్యేక కమిటీ వేయాలని ఆదేశించింది. నైట్ కర్ఫ్యూ విధించడంతో సరిపోదని, ప్రజలను బహిరంగ ప్రదేశాల్లో ఎక్కువగా తిరగకుండా చూడాలని తెలిపింది. ఎన్నికల సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించకుండా ఆంక్షలు విధించాలని ధర్మాసనం పేర్కొంది. వైన్స్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లు, సినిమా థియేటర్ల దగ్గర పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించింది. మ్యారేజ్ ఫంక్షన్స్, పబ్లిక్ ప్లేస్‌లలో ఎక్కువ జనాలు ఉండకుండా చూడాలని, మున్సిపల్ ఎన్నికల సమయంలో భౌతిక దూరం పాటించేలా చూడాలని, ఎన్నికల ర్యాలీలలో జనాభా అధికంగా ఉండకుండా చూడాలని పేర్కొంది. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వారి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్, నేషనల్ హైవే ప్రాంతాల్లో పటిష్ట చర్యలు చేపట్టాలని తెలిపింది. కుంభమేళాకు వెళ్లి వచ్చిన వారిని ప్రత్యేక క్వారంటైన్‌లో ఉంచాలని ఆదేశించింది. ప్రతి ప్రభుత్వ హాస్పిటల్‌లో నోడల్ అధికారిని నియమించాలన్నది. 



రాష్ట్ర వ్యాప్తంగా 108 అంబులెన్సులు 1350 ఉన్నాయని, అందులో కాల్స్ రాగానే 450 వెళ్తున్నాయని ధర్మాసనానికి ప్రభుత్వం తెలపగా.. 108,104 టోల్ ఫ్రీ నెంబర్స్ ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలని హైకోర్టు సూచించింది. ప్రతి ప్రభుత్వ, ప్రయివేటు హాస్పిటల్ దగ్గర డిస్ప్లే బోర్డ్ ఏర్పాటు చేయాలని, ఆర్టీసీఆర్ టెస్ట్ రీపోర్టు 24 గంటల్లో ఇచ్చే విధంగా చూడాలని తెలిపింది. ఆక్సిజన్ కొరత ఉందని ప్రభుత్వం చెబుతోందని, రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్‌లో ఆక్సిజన్ అందుబాటులో ఉండేలా చూడాలని తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా కంటైన్మెంట్ జోన్, మైక్రో కంటైన్మెంట్ జోన్ వివరాలు సమర్పించాలని, ప్రభుత్వం తీసుకున్న చర్యలు, పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 27కు ధర్మాసనం వాయిదా వేసింది. 

Updated Date - 2021-04-23T22:54:08+05:30 IST