కరోనా వ్యాక్సిన్‌పై.. కసరత్తు

ABN , First Publish Date - 2020-12-03T05:51:14+05:30 IST

కరోనా పంపిణీకి సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కసరత్తు ప్రారంభించాయి.

కరోనా వ్యాక్సిన్‌పై.. కసరత్తు

మండల స్థాయిలో టాస్క్‌ఫోర్స్‌ కమిటీలు 

వ్యాక్సిన్‌ పంపిణీకి కార్యాచరణ ప్రణాళికలు

గుంటూరు(మెడికల్‌), డిసెంబరు 2: కరోనా పంపిణీకి సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కసరత్తు ప్రారంభించాయి. ఇప్పటికే రాష్ట్ర, జిల్లా స్థాయిలో చేపట్టిన కార్యక్రమాన్ని మరింత వికేంద్రీకరించి మండల స్థాయి వరకు కమిటీలు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా మండల స్థాయి టాస్క్‌ఫోర్స్‌ కమిటీలో సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ కమిటీలో తొమ్మిది మంది సభ్యులు ఉంటారు. కమిటీ చైర్‌పర్సన్‌గా తహసీల్దారు, కన్వీనరుగా సీనియర్‌ వైద్యాధికారి, సభ్యులుగా ఎంపీడీవో, ఎంఈవో, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్‌ అధికారి, స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ (సబ్‌ ఇన్‌స్పెక్టర్‌) ఉంటారు.  రవాణా శాఖ నుంచి ఒకరిని, స్వచ్ఛంద సంస్థల నుంచి ఒకరిని సభ్యులుగా కలెక్టర్‌ నామినేట్‌ చేస్తారు. వీరితో పాటు మండల స్థాయి వైద్యాధికారులు, అసిస్టెంట్‌ ఇంజనీర్లు కూడా కమిటీ సభ్యులుగా వ్యవహరిస్తారు. వీరు వివిధ ప్రభుత్వ శాఖలతో సమన్వయ సమావేశాలు నిర్వహించి కరోనా వ్యాక్సిన్‌ పంపిణీకి తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించి నివేదిస్తారు.


జిల్లాలో 86 కరోనా కేసులు

జిల్లాలో బుధవారం కొత్తగా 86 కరోనా కేసులు నమోదయ్యా యి. కొంత కాలంగా జిల్లాలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. అయితే డిసెంబరు, జనవరి నెలల్లో చలి అధికంగా ఉంటుందని, ఇది వైరస్‌ వ్యాప్తికి దోహదం చేసే అనుకూల వాతావరణమని, ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నా రు. బుధవారం నమోదైన కేసుల్లో గుంటూరులో 25, అమరావతిలో 3, మంగళగిరిలో 2, రాజుపాలెంలో 3, పెదనందిపాడులో 3, సత్తెనపల్లిలో 3, కారంపూడిలో 4, మాచర్లలో 3, ఈపూరులో 6, రేపల్లెలో 8, తెనాలిలో 4 కేసులు నమోదయ్యాయి.  

Updated Date - 2020-12-03T05:51:14+05:30 IST