కొవిడ్‌ కేసులు.. తగ్గుముఖం

ABN , First Publish Date - 2021-01-24T06:11:06+05:30 IST

వైల్డ్‌ టైప్‌ కరోనా వైరస్‌ జిల్లాలో తగ్గుముఖం పట్టినట్లేనని వైద్యనిపుణులు చెబుతున్నారు. జిల్లాలో రోజూ సగటున 10 నుంచి 15 కేసులు మాత్రమే నమోదౌతున్నాయి.

కొవిడ్‌ కేసులు.. తగ్గుముఖం

రోజూ సగటున 10 నుంచి 15 మాత్రమే..

వ్యాధి నియంత్రణ దిశగా పయనం


గుంటూరు (మెడికల్‌), జనవరి 23: వైల్డ్‌ టైప్‌ కరోనా వైరస్‌ జిల్లాలో తగ్గుముఖం పట్టినట్లేనని వైద్యనిపుణులు చెబుతున్నారు. జిల్లాలో రోజూ సగటున 10 నుంచి 15 కేసులు మాత్రమే నమోదౌతున్నాయి. ప్రస్తుతం కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభించిన నేపథ్యంలో సమీప భవిష్యత్తులో కొత్త కేసుల సంఖ్య సింగిల్‌ డిజిట్‌లోపే పరిమితమై, కొంతకాలానికి కరోనా కేసులు పూర్తిగా ఆగిపోతాయని చెబుతున్నారు. నిరుడు మార్చి నుంచి లాక్‌ డౌన్‌ ప్రకటించిన సమయం నుంచి ఆరేడు నెలల వరకు భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యా యి. వీటికి వైల్డ్‌ టైప్‌ కరోనా వైరస్‌ పాజిటివ్‌ (బాహ్య వాతావరణంలో ఉపరితలాలపై ఉండే వైరస్‌) కేసులుగా గుర్తించారు. జిల్లాలో సుమారు 75 వేల మందికి పైగా జిల్లావాసులు కొవిడ్‌-19 బారిన పడి కోలుకున్నారు. ప్రస్తుతం జిల్లాలో 202 యాక్టివ్‌ పాజిటివ్‌ కేసులు మాత్రమే ఉన్నాయి. వీటిలో కూడా చాలామంది ఇళ్లల్లోనే హోం ఐసోలేషన్‌లో ఉండగా, కొద్ది మంది మాత్రమే ఆసుపత్రుల్లో చికిత్సలు పొందుతున్నారు. కాగా వైద్యాధికారుల అంచనా ప్రకారం జిల్లాలో వైల్డ్‌ టైప్‌ కరోనా వైరస్‌ బాగా తగ్గిపోయింది. కరోనా సోకిన వ్యక్తి నుంచి డ్రాప్‌లెట్‌ ఇన్‌ఫెక్షన్‌ల రూపంలో మాత్రమే ఇతరులకు సోకుతున్నట్లు స్పష్టమౌతోంది. కాగా   ఇంగ్లాండ్‌లో వెలుగు చూసిన కొత్త కరోనా స్ట్రెయిన్‌ కేసులు జిల్లాలో ఇప్పటి వరకు నమోదు కాలేదని అధికార వర్గాలు వెల్లడించాయి.


39 శాతం వ్యాక్సినేషన్‌ నమోదు

జిల్లాలో శనివారం జరిగిన కొవిడ్‌-19 టీకాల కార్యక్రమంలో 39 శాతం వ్యాక్సినేషన్‌ నమోదైం ది. కొ-విన్‌ యాప్‌లో పేర్లు నమోదు చేసుకున్న 1,239 మందికి వ్యాక్సినేషన్‌ చేయాలని ఏర్పాట్లు చేయగా, శనివారం సాయంత్రం డీఎంహెచ్‌వో కార్యాలయానికి అందిన సమాచారం మేరకు 493 మందికి (39 శాతం) టీకాలు వేశారు. దీంతో ఇప్పటివరకు జిల్లాలో 9,831 మంది ఆరోగ్య సిబ్బందికి కరోనా వ్యాక్సినేషన్‌ జరిగినట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ జె.యాస్మిన్‌ తెలిపారు.


కొత్తగా 12 కరోనా కేసులు 

జిల్లాలో శనివారం 12 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు డీఎంహెచ్‌వో  తెలిపారు. గుంటూరు నగరంలో 5 కేసులు నమోదు కాగా, మంగళగిరిలో 1, సత్తెనపల్లిలో 1, తాడేపల్లిలో 3, బొల్లాపల్లిలో 1, చిలకలూరిపేటలో 1 కేసు నమోదయ్యాయని ఆమె తెలిపారు. 

Updated Date - 2021-01-24T06:11:06+05:30 IST