కొవిడ్ కేంద్రం ఖాళీ..
ABN , First Publish Date - 2021-06-22T05:00:59+05:30 IST
కరోనా బాధితులకు వైద్య సేవలందించడానికి ఏర్పాటుచేసిన కొవిడ్ కేంద్రం అలంకారప్రాయంగా మారింది.
ఇళ్లలోనే కరోనా బాధితులు
వేలేరుపాడు, జూన్ 21: కరోనా బాధితులకు వైద్య సేవలందించడానికి ఏర్పాటుచేసిన కొవిడ్ కేంద్రం అలంకారప్రాయంగా మారింది. సుమారు నెల రోజుల క్రితం శివకాశీపురం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో కొవిడ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. తర్వాత పది రోజుల క్రితం బాలుర వసతి గృహానికి మార్చారు. ఇప్పటివరకు ఒక్క కరోనా భాధితుడిని కూడా ఈ ఐసొలేషన్ కేంద్రానికి తరలించలేదు. మండలంలో ప్రతీ రోజు ఐదు నుంచి 10, ఒక్కొక్కసారి 20 వరకు కరోన పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. వైద్యాధికారులు మాత్రం కరోన సోకిన వారిని ఇళ్లకే పరిమితం చేస్తున్నారు. ఈవిధంగా చేయడం వలన కరోన ఒకరి నుంచి మరికొంత మందికి సోకుతూ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రధానంగా పల్లెల్లో గృహాలు ఇరుకుగా ఉండడం, కుటుంబ సభ్యులు అధికంగా ఉండడం వల్ల కరోన బాధితులు అదే ఇంట్లో ఉండడం వలన కుటుంబ సభ్యులతో పాటు చుట్టు పక్కల వారికి కూడా వైరస్ వ్యాపిస్తొంది. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొవిడ్ ఐసోలేషన్ కేంద్రాన్ని సక్రమంగా వినియోగించు కుని ఉంటే మండలంలో ఇన్ని కరోన పాజిటివ్ కేసులు వచ్చి ఉండేవి కాదని పలువురు చెబుతున్నారు.
ఇదే విషయంపై వైధ్యాధికారిని డాక్టర్ రహీమా నస్రీమ్ను వివరణ కోరగా కరోన బాధితుల అభ్యర్ధన మేరకే హోం క్వారంటైన్లో ఉంచుతున్నా మన్నారు. బలవంతంగా వారిని కొవిడ్ ఐసోలేషన్ సెంటర్కు తరలించలేం కదా అన్నారు. జిల్లా అధికారులు ఇప్పటికైనా ఐసోలేషన్ కేంద్రానికి కొవిడ్ బాధితులను తరలిస్తే కరోనా వ్యాప్తిని అరికట్టే అవకాశం ఉంటుంది.