Covid నాలుగో వేవ్ వచ్చే అవకాశం..!
ABN , First Publish Date - 2022-03-21T14:24:47+05:30 IST
రాష్ట్రంలో కరోనా నాలుగో అల వచ్చే అవకాశముందని, నిబంధనలు పాటించి వ్యాక్సిన్ వేసుకొని వైరస్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ
- నిబంధనలు పాటించి వ్యాక్సిన్ వేసుకోండి
- ఆరోగ్య శాఖ కార్యదర్శి రాధాకృష్ణన్
పెరంబూర్(చెన్నై): రాష్ట్రంలో కరోనా నాలుగో అల వచ్చే అవకాశముందని, నిబంధనలు పాటించి వ్యాక్సిన్ వేసుకొని వైరస్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ కార్యదర్శి డా.జె.రాధాకృష్ణన్ ప్రజలకు సూచించారు. నగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కరోనా మూడో అల నియంత్రణలోకి రావడంతో ప్రజలు నిబంధనలు పాటించడం లేదన్నారు. ప్రపంచంలోని పలు దేశాల్లో ప్రస్తుతం నాలుగో విస్తృతంగా ఉందనే విషయం గుర్తించి, నిబంధనలు పాటించి వ్యాక్సిన్ తప్పక వేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 92 శాతం మంది మొదటి డోస్, 80 శాతం మంది రెండు డోస్లు తీసుకున్నారన్నారు. అదే సమయంలో 51 లక్షల మంది మొదటి డోస్ కూడా వేయించుకోలేదని, మరో 1.34 కోట్ల మంది రెండో డోస్ వేయించుకోలేదని తెలిపారు. టీకాలు వేయించుకోని వారి జాబితా సిద్ధం చేసి, వారి వద్దకే వెళ్లి టీకా వేసేలా చర్యలు చేపట్టామన్నారు. రాష్ట్రంలో 12-14 ఏళ్లలోపున్న 4.29 లక్షల మంది చిన్నారులకు టీకా వేశామన్నారు. ప్రస్తుతం సరిపడా టీకాలు అందుబాటులో ఉన్నాయన్నారు. నాలుగో అల బారిన పడకుండా బహిరంగ ప్రాంతాల్లో మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడంతో పాటు టీకా తప్పనిసరిగా వేసుకోవాలని రాధాకృష్ణన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.