కొవిడ్ ఆసుపత్రిగా మార్చారు.. వసతులు మరిచారు..!
ABN , First Publish Date - 2021-05-11T06:03:55+05:30 IST
మార్కాపురం జిల్లా వైద్యశాలను కొవిడ్ ఆసుపత్రిగా మార్చిన అధికారులు వసతులు మరిచారు. దీంతో కరోనా బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మార్కాపురం, మే 10 : మార్కాపురం జిల్లా వైద్యశాలను కొవిడ్ ఆసుపత్రిగా మార్చిన అధికారులు వసతులు మరిచారు. దీంతో కరోనా బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ ఉన్న బెడ్లకు మిం చి కేసులు వస్తున్నాయి. దీంతో బాధితులు వైద్యం కో సం పడిగాపులు కాస్తున్నారు. మరోవైపు వైద్యులు, సి బ్బంది కొరతతో అందరికీ చికిత్స అందించడం కష్టం గా మారింది. ఇక్కడ పనిచేస్తున్న పలువురు వైద్యు లు, స్టాఫ్ నర్సులు డిప్యుటేషన్పై ఇతర ప్రాంతాలకు వెళ్లడం ఇందుకు కారణమైంది.
కరోనా బాధితులను ఒంగోలుకు తరలించకుండా మార్కాపురం జిల్లా వైద్యశాలలో చికిత్స అందిం చేం దుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. సోమవారం నుంచి దీన్ని అమల్లోకి తెచ్చారు. తొలుత ఆసు పత్రిలోని గ్రౌండ్ ఫ్లోర్లో 40 పడకలను కరోనా బాధితులకు కేటాయించారు. మొదటి అంతస్తును గర్భిణులకు వినియోగించాలని నిర్ణయించారు. కానీ బాధితుల సంఖ్య అధికంగా ఉండటంతో గర్భిణుల వార్డును కూడా కరోనా చికిత్సకు వినియోగించాలని భావిస్తున్నారు. అక్కడ ఉన్న గర్భిణులను పట్టణం లోని ఎస్ఎస్ఏఎంఎస్ వైద్యశాలకు తరలించేందుచు ఏర్పాట్లు చేస్తున్నారు.
కారిడార్లో కరోనా బాధితులు
మార్కాపురం జిల్లా వైద్యశాల కరోనా బాధితుల తాకిడి అధికంగా ఉంది. స్థాయిని మించి బాధితులు వస్తుండటంతో నిర్దేశించడంతో గదుల బయట కారిడార్లో సైతం మంచాలు ఏర్పాటు చేశారు. ఇంతమందికి వైద్యాధికారులు పూర్తి స్థాయిలో వై ద్యం చేయలేకపోతున్నారు.
వెంటాడుతున్న డాక్టర్ల కొరత
మార్కాపురం ఏరియా ఆసుపత్రి ఆ స్థాయి నుంచి జిల్లా వైద్యశాల స్థాయికి మారినప్పటి నుంచి వైద్యు లు, సిబ్బంది కొరత వెంటాడుతోంది. కొవిడ్ ఆసు పత్రిగా మార్పు చేయడంతో ఈ సమస్య ఇంకా ఎక్కు వైంది. సాధారంగా జిల్లా వైద్యశాలగా ఉన్నప్పుడు డ్యూటీ డాక్టర్ మినహా మిగిలిన డాక్టర్లు నిర్ధిష్ట టైం టేబుల్ మేరకు విధులు నిర్వహిస్తారు. కానీ ఇప్పుడు డాక్టర్లంతా సాధారణ విధులు నిర్వహించాల్సి ఉం టుంది. ప్రసూతి వైద్యులు మినహా మిగిలిన వారంతా ప్రస్తుతం షిప్ట్ పద్ధతిలో పని చేయాల్సి ఉంది. కానీ ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్కాపురం జిల్లా వైద్య శాలలో నియామకం పొందిన వైద్యులు పలువురు రాజకీయ పలుకుబడులతో వారికి అనుకూలమైన ప్రాంతాలకు, వారు సొంతంగా వైద్యశాలలు ఏర్పాటు చేసుకున్న పట్టణాలకు దగ్గరలో ఉన్న వైద్యశాలలకు డిప్యుటేషన్పై వెళ్లారు. దీంతో ఇక్కడ వైద్యుల కొరత ఏర్పడింది.
అదే రీతిలో స్టాఫ్ నర్సులు
వైద్యుల కొరత ఇలా ఉంటే స్టాఫ్ నర్సుల పరిస్థితి మరో విధంగా ఉంది. ఉద్యోగ నియామకం జరిగిన సమయంలో మార్కాపురం జిల్లా వైద్యశాలలో పోస్టింగ్లు పొందిన పలువురు స్టాఫ్ నర్సులు విధుల్లో చేరిన తర్వాత డిప్యుటేషన్ల పేరుతో వారికి అనుకూలమైన వైద్యశాలలకు బదిలీ చేయించుకు న్నారు. అలాంటి వారు సుమారు 10 మంది వరకూ ఉన్నారు.