దూకుడు తగ్గిన కొవిడ్
ABN , First Publish Date - 2021-06-22T07:06:44+05:30 IST
జిల్లాలో కొవిడ్ దూకుడు తగ్గింది. కేసుల సంఖ్య నెమ్మదించింది.
చాలా రోజుల తర్వాత 127 పాజిటివ్లు
కొత్తగా నమోదుకాని బ్లాక్ ఫంగస్ కేసులు
ఒంగోలు(కార్పొరేషన్), జూన్ 21 : జిల్లాలో కొవిడ్ దూకుడు తగ్గింది. కేసుల సంఖ్య నెమ్మదించింది. దాదాపు 70 రోజుల తర్వాత తక్కువ సంఖ్యలో సోమవారం 127 పాజిటివ్లు నమోదయ్యాయి. మరోవైపు గడచిన 24 గంటల్లో ఒక్క బ్లాక్ ఫంగస్ కేసు కూడా వెలుగు చూడలేదు. ఇది స్వల్ప ఊరటనిస్తోంది. కరోనా బాధితులు క్రమంగా కోలుకోవడంతో ఆసుపత్రుల్లోనూ పడకల సమస్య తీరింది. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా ఒంగోలు అర్బన్లో 28 ఉన్నాయి. ఒంగోలు రూరల్లో 15, సంతనూతలపాడు 11, కొనకమిట్లలో 10 నిర్ధారణ అయ్యాయి. వీటితోపాటు వివిధ ప్రాంతాల్లో పలువురు వైరస్ బారినపడ్డారు. చికిత్స పొందుతున్న వారిలో సోమవారం ముగ్గురు మరణించగా,383 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 862 మంది కొవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా, 315 మంది కేర్ సెంటర్లలో ఉన్నారు. మరో 4192 మంది హోం ఐసోలేషన్లో ఉండి వైద్యం చేయించుకుంటున్నారు. ఇదిలా ఉండగా జిల్లాలో కొత్తగా బ్లాక్ ఫంగస్ కేసులేమీ నమోదు కాలేదు. ఇప్పటి వరకూ 145 కేసులు వెలుగు చూడగా 57 మందికి రిమ్స్ వైద్యులు శస్త్ర చికిత్సలు నిర్వహించారు. 29 మంది కోలుకొని వైద్యశాల నుంచి డిశ్చార్జి అయ్యారు. మరో 15 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఒంగోలు రిమ్స్లో 71 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మిగిలిన వారు ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.