చైనాలో మరీ ఇంత ఘోరమా..? కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటనలు.. ఆస్పత్రుల ముందే ప్రాణాలు పోతున్నా..
ABN , First Publish Date - 2022-01-15T16:35:15+05:30 IST
కొవిడ్ పుట్టినిల్లు చైనాలో.. మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోవడానికి అక్కడి ప్రభుత్వం కఠిన ఆంక్షలను అమలు చేస్తోంది. అయితే ఈ ఆంక్షలు అక్కడి ప్రజల పాలిట మృత్యుపాశాలుగా తయా
ఇంటర్నెట్ డెస్క్: కొవిడ్ పుట్టినిల్లు చైనాలో.. మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోవడానికి అక్కడి ప్రభుత్వం కఠిన ఆంక్షలను అమలు చేస్తోంది. అయితే ఈ ఆంక్షలు అక్కడి ప్రజల పాలిట మృత్యుపాశాలుగా తయారయ్యాయి. ఆస్పత్రుల ముందే ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
కరోనా మహమ్మారి.. 2019లో చైనాలో పుట్టికొచ్చి తర్వాత ప్రపంచ దేశాలకు వ్యాప్తి చెందిన విషయం తెలిసిందే. ఈ మహమ్మారి రూపాలను మార్చుకుంటూ కలవరపాటుకు గురిచేస్తోంది. దక్షిణాఫ్రికాలో బయటపడిన ఒమైక్రాన్ వేరియంట్ చైనాలో కూడా అడుగుపెట్టింది. ఒమైక్రాన్ కారణంగా చైనాలోని కొన్ని ముఖ్య నగరాల్లోని ప్రజలు కొవిడ్ బారినపడుతున్నారు. బీజింగ్లో త్వరలో వింటర్ ఒలింపిక్స్ జరగనున్న నేపథ్యంలో జిన్పింగ్ ప్రభుత్వానికి ఒమైక్రాన్ వేరియంట్ సవాలుగా మారింది. దీంతో జీరో కొవిడ్ కేసులే లక్ష్యంగా కరోనా కట్టడి కోసం జిన్పింగ్ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది.
సెంట్రల్ చైనాలోని జియాంగ్, అన్యాంగ్ వంటి నగరాల్లో కఠినంగా లాక్డౌన్ను అమలు చేస్తోంది. దీంతో కొవిడ్ పేషెంట్లను మినహా ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడేవారిని అక్కడ పట్టించుకునే పరిస్థతి లేకుండా పోయింది. ఛాతిలో విపరీతమైన నొప్పితో బాధపడుతూనే, అనేక ఇబ్బందులను ఎదుర్కొని ఆసుపత్రికి చేరినా ఓ వృద్ధుడికి వైద్యం అందలేదు. దీంతో ఆసుపత్రి ముందే కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. ఓ గర్భిణి సైతం పురిటి నొప్పులతో బాధపడుతూ ఆసుపత్రికి చేరుకున్నా సకాలంలో డాక్టర్లు ఆమెకు వైద్యం అందించలేకపోయారు. ఫలితంగా తల్లి కడుపులోనే బిడ్డ కన్ను మూసింది. ఆహార పదార్థాల కోసం రోడ్డెక్కితే పోలీసుల చేతుల్లో అక్కడి ప్రజలకు చావు తప్పడం లేదు. పొరపాటున ఎవరైనా కొవిడ్ బారినపడితే ఆ వ్యక్తులను కనీసం మనుషుల్లా కూడా చూడటం లేదు. స్వల్ప లక్షణాలు కనిపిస్తే చాలు వారిని బలవంతంగా తీసుకెళ్లి.. కొన్ని మెటల్ బాక్సులలో నిర్భందిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ‘ఇప్పటికే నియంత అని పేరు తెచ్చుకున్న జిన్పింగ్.. మనిషిని అనే విషయాన్ని కూడా మర్చిపోయి కఠినంగా వ్యవహరిస్తున్నాడు’ అని నెటిజన్లు మండిపడుతున్నారు.