సత్ఫలితాలిస్తున్న కొవిడ్ నియంత్రణ చర్యలు
ABN , First Publish Date - 2021-05-09T06:28:08+05:30 IST
కరోనా నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.
మంత్రి ఆదిమూలపు సురేష్
ఎర్రగొండపాలెం, మే 8 : కరోనా నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. శనివారం ఎర్రగొండపాలెంలోని క్యాంపు కార్యాలయంలో ఆయన విలే కరులతో మాట్లాడారు. కరోనా వైరస్ను నియంత్రణ చేసేందుకు నియోజకవర్గ కేంద్రాల్లో కొవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తులకు వైద్యచికిత్సలు నిర్వహిస్తూ, వారికి మంచి ఆహారం సరఫరా చేసి మనోధైర్యం కల్పించేందుకు డాక్టర్లు, అధికారులు సేవలు అందిస్తున్నారని వివరించారు. ఎర్రగొండపాలెం సీహెచ్సీలో నిత్యం వంద మందికి కొవిడ్ టెస్టు లు చేస్తున్నట్టు చెప్పారు. ఈ సీహెచ్సీ కొవిడ్ వార్డులో 18 ఆక్సిజన్ బెడ్లు ఉన్నాయని చెప్పారు. మరో పది బెడ్లు పెంచేందుకు సొంత ఖర్చుతో పది ఆక్సి జన్ సిలిండర్లు కొనిస్తానని తెలిపారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి 25 బెడ్లు, మంచాలు సరఫరా చేశారని చెప్పారు. జిల్లాలో కరోనా వైరస్ నియంత్రణ చేసేందుకు కాంట్రాక్ట్ పద్ధతిన డాక్టర్ల నియామకానికి కలెక్టర్లకు అవకాశం ఇచ్చారని అన్నారు.సమావేశంలో ఏఎంసీ చైర్మన్ ఒంగోలు మూర్తిరెడ్డి, సర్పంచ్ ఆర్.అరుణాబాయ్, కన్వీనర్ ఉడుముల శ్రీనివాసరెడ్డి, ఒంగోలు పార్లమెంటు వైసీపీ కార్యదర్శి బీవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు.
పీపీఈ కిట్ల పంపిణీ
ఎర్రగొండపాలెం కొవిడ్ కేర్ సెంటర్కు 100, మార్కాపురం కొవిడ్ కేర్ సెంటర్కు 100 పీపీఈ కిట్లను మంత్రి సురేష్ పంపిణీ చేశారు. డాక్టర్ల రక్షణకు తన సొంత నిధులతో 200 కిట్లు పంపిణీ చేసినట్టు చెప్పారు. కార్యక్రమంలో తహసీల్దారు వి.వీరయ్య, డాక్టరు సక్రునాయక్, సొసైటీ చైర్మన్ దండా శ్రీనివాసరెడ్డి, మాజీ సర్పంచ్ గంజి శ్రీనివాసరెడ్డి, పంచాయతీ కార్యదర్శి ఈ.రాజశేఖరరెడ్డి పాల్గొన్నారు.
ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో 11 మందికి మంజూరైన రూ.8లక్షల18వేల చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఆరోగ్యశ్రీ వర్తించని వ్యాధులకు అధిక మొత్తం ఖర్చుచేసి ఆర్థికంగా చితికిపోయిన వ్యక్తులకు సీఎం సహాయనిధి వరంగా పనిచేస్తుందని చెప్పారు.. ఇప్పటికీ ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో రూ.2 కోటు సహయనిధి నగదు చెక్కులను పంపిణీ చేశామని మంత్రి చెప్పారు.