వెంటాడుతున్న భయం
ABN , First Publish Date - 2021-12-07T18:30:19+05:30 IST
రాష్ట్రంలో కరోనా అదుపులోనే ఉందని ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన పనిలేదని బహిరంగంగా చెప్పుకొంటున్నా అంతర్గతంగా రాష్ట్రమంతటా కఠిన నిబంధనలు అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రెండోవిడత
- ఒమైక్రాన్పై లోలోపల అలజడి
- కరోనా ప్రభావం లేదంటూనే రాష్ట్రమంతటా కఠిన నిబంధనలు
- విద్యా సంస్థల్లో కేసుల పెరుగుదలపై ఆందోళన
బెంగళూరు: రాష్ట్రంలో కరోనా అదుపులోనే ఉందని ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన పనిలేదని బహిరంగంగా చెప్పుకొంటున్నా అంతర్గతంగా రాష్ట్రమంతటా కఠిన నిబంధనలు అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రెండోవిడత కొవిడ్ కాలంలో డెల్టా వేరియంట్తో పోల్చితే ఒమైక్రాన్ వైరస్ అంత ప్రభావం చూపడం లేదంటున్నా ప్రజలు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలనే షరతు విధిస్తున్నారు. రాష్ట్రంలో రెండో విడత కొవిడ్ ప్రభావం దాదాపు మూడు నెలలుగా అదుపులో ఉంది. 500కు మించి కేసులు నమోదు కావడం లేదు. ఇక ఉత్తర కర్ణాటకలోని పది జిల్లాల్లో కొవిడ్ కేసులు జీరోగా కొనసాగుతున్నాయి. యాక్టివ్ కేసులు పదిలోపు ఉండే జిల్లాలు లేకపోలేదు. ఒమైక్రాన్ వేరియంట్ ఎటువంటి అలజడి సృష్టిస్తుందో అనే భయం వెంటాడుతోంది. జీరో కేసులు నమోదవుతున్న జిల్లాల్లోనూ మాస్కు లేకుంటే వంద రూపాయల జరిమానా విధిస్తున్నారు. కలబుర్గి, బీదర్, రాయచూరు, రామనగర్, గదగ్ తదితర జిల్లాల్లో కేసులు లేకున్నా నిబంధనలు మాత్రం తప్పనిసరి చేశారు. పదిరోజుల వ్యవధిలో విద్యాసంస్థల్లోనే ఎక్కువసంఖ్యలో కేసులు నమోదయ్యాయి. బెంగళూరు, మైసూరు, ధార్వాడ, శివమొగ్గలోని నర్సింగ్ కళాశాలలు, నవోదయ విద్యాలయాలలో పదులసంఖ్యలో కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఇక రెసిడెన్షియల్ స్కూళ్లలో కట్టడి చేస్తే వైరస్ తీవ్రతను తగ్గించవచ్చుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విద్యాసంస్థల్లో వైరస్ ప్రబలేందుకు కేరళ నుంచి వచ్చిన విద్యార్థులు కారణమని అధికారులు అభిప్రాయపడుతున్నారు.