కొవిడ్ పరీక్ష.. ప్రహసనం
ABN , First Publish Date - 2021-04-22T05:40:36+05:30 IST
ఏలూరు ప్రభుత్వాసుపత్రికి కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది.
ఏలూరు క్రైం, ఏప్రిల్ 21 : ఏలూరు ప్రభుత్వాసుపత్రికి కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది. జ్వరం వచ్చి ఆకలి వేయకుండా ఉండడం, ఏమి తినకుండా ఉండిపోవడం, ఏదైనా తింటే వాంతులవడం వంటి లక్షణాలు కలిగి నీరసించిన బాధితులు ఆసుపత్రికి వస్తున్నారు. నిన్నటి వరకూ ఇలాంటి వారిని సాధారణ రోగులుగా చేర్చుకుని వైద్య సేవలందిస్తూ కొవిడ్ పరీక్షలు చేశారు. బుధవారం నుంచి ఈ విధానం మారింది. నీరసించిన ఇలాంటి వారిని కొవిడ్ పరీక్ష చేయ కుండా ఆసుపత్రిలో చేరిస్తే వీరికి కరోనా వచ్చే ప్రమాదం ఉంది. దీంతో వైద్యులు ముందుగా కొవిడ్ పరీక్ష చేయించుకు ని ఆసుపత్రిలో చేరాలని, అప్పటి వరకూ జ్వరం, ఒళ్లు నొప్పు లు, వాంతులు తగ్గడానికి మందులు ఇస్తున్నారు. మరీ నీర సించిన వారికి అత్యవసర విభాగంలోనే సిలైన్లను ఎక్కిస్తున్నా రు. కొవిడ్ పరీక్షల కోసం వచ్చే వారి సంఖ్య అంతా ఇంతా కాదు. ఉదయం నుంచి ఆసుపత్రి వద్ద ఆన్లైన్లో ఐడీలు చేయించుకోవడానికి లైన్లో ఉంటున్నారు. సర్వర్లు సరిగా పని చేయకపోవడంతో గంటల తరబడి ఉండాల్సి వస్తోంది. కొవిడ్ పరీక్ష ఫలితాలకు ఐదు రోజులు పడుతుండటంతో బాధితులు మరింత నీరసించిపోతున్నారు. సాధారణ వైద్యానికి ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లినా కొవిడ్ పరీక్ష ఉంటేనే వైద్య సేవలు చేస్తా మంటూ చెబుతున్నారని చివరికి ఏలూరు ప్రభుత్వాసుపత్రే దిక్కంటే ఇక్కడికే వస్తున్నారు. వీఆర్డీఎల్ ల్యాబ్లో పరీక్షలు త్వరితగతిన చేస్తే రోగులకు సకాలంలో వారి కరోనా నిర్ధారణ పరీక్ష వెల్లడవుతుంది. ఆ ఫలితాన్ని బట్టే వారు కరోనా ఆసు పత్రిలో చేరాలా, సాధారణ వైద్య సేవలు పొందాలా అని నిర్ణ యించుకుంటారు. అధికారులు సకాలంలో కరోనా నిర్ధారణ పరీక్ష ఫలితాలు అందేలా చూడాల్సి ఉంది.