ఆగస్టు చివర్లో Corona third wave: ఐసీఎమ్ఆర్ శాస్త్రవేత్త
ABN , First Publish Date - 2021-07-16T02:40:32+05:30 IST
ఆగస్టు చివర్లో దేశంలో కరోనా థర్డ్ వేవ్ రావచ్చని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎమ్ఆర్) అంటువ్యాధుల విభాగం అధిపతి డా. సమీరన్ పండా తాజాగా పేర్కొన్నారు.
న్యూఢిల్లీ: ఆగస్టు చివర్లో దేశంలో కరోనా థర్డ్ వేవ్ రావచ్చని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎమ్ఆర్) అంటువ్యాధుల విభాగం అధిపతి డా. సమీరన్ పండా తాజాగా పేర్కొన్నారు. కరోనా థర్డ్ వేవ్ వచ్చినప్పటికీ.. దాని తీవ్రత సెకెండ్ వేవ్ స్థాయిలో ఉండకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఓ జాతీయ ఛానల్కు గురువారం నాడు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నాలుగు కారణాల వల్ల థర్డ్ వేవ్ రావచ్చని డా. పండా తెలిపారు. కరోనా మొదటి, రెండో వేవ్ సమయంలో అభివృద్ధి చెందిన రోగనిరోధక శక్తి(ఇమ్యూనిటీ) బలహీనపడటం, ఇమ్యూనిటీకి టోకరా ఇవ్వగలిగిన, లేదా వేగంగా వ్యాపించే సామర్థ్యం ఉన్న వేరియంట్లు ఉనికిలోకి రావడం, కరోనా ఆంక్షలు ఎత్తివేయడంలో తొందరపాటు కారణంగా మూడో వేవ్ వచ్చే ప్రమాదం ఉందని డా. పండా పేర్కొన్నారు. థర్డ్ వేవ్కు డెల్టా ప్లస్ వేరియంట్ కారణం కానుందా అని ప్రశ్నించగా.. డెల్టా వేరియంట్లు రెండూ ఇప్పటికే దేశవ్యాప్తంగా విస్తరించాయని, వీటి వల్ల ఆరోగ్యవ్యవస్థపై అదనపు భారం పడుతుందని తాను భావించట్లేదని డా. పండా తెలిపారు.