రిజిస్ట్రేషన్ శాఖలో కలకలం
ABN , First Publish Date - 2021-04-21T04:28:02+05:30 IST
జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై కరోనా పంజా విసిరింది. నిత్యం జనం రాకపోకలు సాగించే ఈ కార్యాలయాల్లో కొవిడ్ నిబంధన లు సక్రమంగా అమలు కావడం లేదు. ఫలితంగా వైరస్ వ్యాప్తి చెందుతోంది.
నలుగురు సిబ్బందికి కరోనా
మూతపడ్డ కార్యాలయాలు
నెల్లూరు(హరనాథపురం), ఏప్రిల్ 20 : జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై కరోనా పంజా విసిరింది. నిత్యం జనం రాకపోకలు సాగించే ఈ కార్యాలయాల్లో కొవిడ్ నిబంధన లు సక్రమంగా అమలు కావడం లేదు. ఫలితంగా వైరస్ వ్యాప్తి చెందుతోంది. తాజాగా జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో ముగ్గురికి కరోనా సోకింది. దీంతో ఆ కార్యాలయా న్ని మంగళవారం మూసేశారు. కావలి సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో ఒకరికి కరోనా సోకటంతో ఆ కార్యాలయాన్ని కూడా మూసేశారు. ఇదేవిధంగా మంగళవారం పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కూడా మూతపడటంతో రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు స్తంభించాయి.
కాగా, గతేడాది సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బందికి కరోనా సోకినప్పుడు దాదాపుగా రెండు వారాలపాటు కార్యాలయాలను మూసేశారు. ప్రస్తుతం కార్యాలయాలను శానిటైజ్ చేసి ఒక్క రోజు మాత్రమే సెలవు ఇస్తుండటంతో ఉద్యోగులు విధులు నిర్వహించడానికి భయాందోళన చెందుతున్నారు. దిగువస్థాయి సిబ్బందిని కార్యాలయ ప్రాంగణంలో నియ మించి జనరద్డీని తగ్గిస్తే కరోనా వ్యాప్తిని కొంతమేర కట్టడి చేయవచ్చు. అయితే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సిబ్బంది కొరత ఉండటంతో నియంత్రణ చర్యలకు తీవ్ర విఘాతం కలుగుతోంది.
జీజీహెచ్లో బెడ్లు ఇవ్వరా?
మంత్రి అనిల్ రాజకీయాలు పక్కన పెట్టాలి
టీడీపీ నగర ఇన్చార్జి కోటంరెడ్డి
నెల్లూరు (వైద్యం), ఏప్రిల్ 20 : నెల్లూరులోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కరోనా బాధితులకు కల్పిస్తున్న సౌకర్యాలు అధ్వానంగా ఉన్నాయని టీడీపీ నగర ఇన్చార్జి కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం టీడీపీ నేత కృష్ణమూర్తి కొవిడ్ బారినపడటంతో జీజీహెచ్కు తరలించారు. అయితే అక్కడ సిబ్బంది పట్టించుకోలేద ని, బెడ్ అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని, సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళితేగానీ పడక ఏర్పాటు చేయలేదన్నారు. ఆసుపత్రిలో పడకలు అందుబాటులో ఉన్నా సిబ్బంది చర్యల వల్ల బాధితులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని కోటంరెడ్డి ఆరోపించారు. పడకలకు కొరత లేదని అధికారులు చెబుతున్నా జీజీహెచ్లో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయన్నారు. మంత్రి అనిల్కుమార్ రాజకీయాలు పక్కన పెట్టి కరోనా రోగుల విషయంలో మానవత్వంతో వ్యవహరించాలని కోరారు.
పరీక్షలు రద్దు చేయాలి
ఏపీ విద్యార్థి జేఏసీ
నెల్లూరు(స్టోన్హౌస్పేట), ఏప్రిల్ 20: కరోనా విజృంభిస్తున్న నేపఽథ్యంలో ఢిల్లీ, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు విద్యా సంస్థలను మూసివేసి పరీక్షలను రద్దు చేశాయని, మన రాష్ట్రంలోనూ పదోతరగతి ఇంటర్ పరీక్షలను రద్దు చేయాలని ఏపీ విద్యార్థి జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీ ఆదిత్యసాయి డిమాండ్ చేశారు. నగరంలోని సర్వోదయ కళాశాలలో మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఇప్పటికే విద్యార్థులు, యువతలో కొవిడ్ వ్యాప్తి అధికంగా ఉందని, ప్రభుత్వం పరీక్షలు రద్దు చేసి విద్యార్థుల ప్రాణాలను కాపాడాలన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్, మధు, అనిల్ తదితరులు పాల్గొన్నారు.