మూలుగుతున్న Covid వ్యాక్సిన్లు
ABN , First Publish Date - 2021-11-17T18:00:06+05:30 IST
కొవిడ్ వ్యాక్సిన్ డోసులు పెద్ద ప్రమాణంలో అందుబాటులోకి రావడంతో ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో ఇతర బహిరంగ ప్రదేశాల్లో ఉచితంగా అందజేస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి ఆరోగ్య కార్యకర్తలు వ్యాక్సిన్లను అందించే
- ప్రైవేటు ఆసుపత్రుల్లో కొవిడ్ వ్యాక్సిన్లకు భారీగా తగ్గిన డిమాండ్
బెంగళూరు: కొవిడ్ వ్యాక్సిన్ డోసులు పెద్ద ప్రమాణంలో అందుబాటులోకి రావడంతో ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో ఇతర బహిరంగ ప్రదేశాల్లో ఉచితంగా అందజేస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి ఆరోగ్య కార్యకర్తలు వ్యాక్సిన్లను అందించే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యలో రాజధాని బెంగళూరు నగరంలోని అనేక ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులల్లో అడిగే నాథుడు లేక కొవిడ్ వ్యాక్సిన్ డోసులు పెద్ద ప్రమాణంలో మూలుగుతున్నాయి. ఈ డోసుల అవధి ముగియనుండటంతో ఆసుపత్రుల నిర్వహకులకు ఆందోళన ప్రారంభమైంది. డోసుల అవధి ముగిస్తే ఇవి ఎందుకూ కొరగాకుండా పోతాయి. ఫలితంగా లక్షలాది రూపాయల నష్టం భరించాల్సి ఉంటుంది. ఈ కారణంగా కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు కూడా కొవిడ్ టీకాలను ఉచితంగా అందించే సన్నాహాల్లో ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వం కొవిడ్ వ్యాక్సిన్ డోసులను ఉచితంగా అందిస్తున్నప్పటికీ ప్రైవేటు ఆసుపత్రుల్లో ఒక్కో డోసుకు రూ. 780 వసూలు చేస్తున్నారు. వ్యాక్సిన్ ధర రూ. 630తో పాటు సర్వీస్ ఫీజుగా రూ. 150 విధిస్తున్నారు. గత 15 రోజులుగా ప్రైవేటు ఆసుపత్రుల్లో కొవిడ్ వ్యాక్సిన్కు డిమాండ్ పూర్తిగా పడిపోయింది. మరో నెల పాటు ఇదే పరిస్ధితి కొనసాగితే ఒక్కో డోసుకు రూ.630 వరకు నష్టం ఉంటుందని ఈ లెక్కన వేలాది డోసుల నిల్వలు ఏమి చేయాలో అర్థం కావడం లేదని నగరంలోని ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రి నిర్వాహకుడొకరు సోమవారం మీడియాకు చెప్పారు. ఇప్పటికే ప్రైవేటు ఆసుపత్రుల్లో ఒక శాతం వరకు వ్యాక్సిన్లు వృథా అయినట్లు చెప్పారు. రాజధాని బెంగళూరు నగరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్ రెండో డోసు ప్రక్రియ చాలా నిదానంగా సాగుతోందని ఆరోగ్య శాఖ వర్గాలు అంటున్నాయి.