మూడో విడత వ్యాక్సినేషన్ మొదలు
ABN , First Publish Date - 2021-03-02T06:46:21+05:30 IST
ఇప్పటివరకు జిల్లాలో ఎంపిక చేసిన సిబ్బందికి మాత్రమే కొవిడ్ వ్యాక్సిన్ వేశారు. మొదటి రెండు విడతల్లో ఫ్రంట్లైన్ వారియర్స్ టీకాను సద్వినియోగం చేసుకున్నారు.
ఆన్లైన్లో పేరు నమోదు చేసుకున్న వారికి జిల్లాలో
32 ప్రభుత్వ ఆసుపత్రులు కేటాయింపు
8 ఆరోగ్య్రశీ అనుబంధ ఆసుపత్రుల్లో ఎక్కడైనా టీకా
45 ఏళ్ల నుంచి 59 ఏళ్లలోపు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు వైద్యుని ధ్రువీకరణ పత్రం తప్పనిసరి
60 ఏళ్లు దాటిన వారికీ అవకాశం
(కాకినాడ, ఆంధ్రజ్యోతి) ఇప్పటివరకు జిల్లాలో ఎంపిక చేసిన సిబ్బందికి మాత్రమే కొవిడ్ వ్యాక్సిన్ వేశారు. మొదటి రెండు విడతల్లో ఫ్రంట్లైన్ వారియర్స్ టీకాను సద్వినియోగం చేసుకున్నారు. మూడో విడత సోమవారం ప్రారంభమైంది. 45 ఏళ్ల నుంచి 59 ఏళ్లలోపు వయసు వ్యక్తుల్లో దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి వ్యాధిని ధ్రువీకరిస్తూ సంబంధిత వైద్యుడు జారీ చేసిన సర్టిఫికెట్తో వ్యాక్సిన్ వేస్తారు. 60 ఏళ్లు దాటిన వారందరూ వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. దీంతో ఈ ప్రక్రియ వేగవంతం కానుంది. జిల్లాలోని 32 ప్రభుత్వ, 8 ఆరోగ్యశ్రీ అనుబంధ ఆస్పత్రుల్లో టీకా వేయడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వ్యాక్సిన్ వేయించుకోవాలనుకునే వారు తప్పని సరిగా ఆన్లైన్లో పేరు నమోదు చేయించుకోవాలి. ఇందుకు వెబ్సైట్ను అందుబాటులోకి తెచ్చారు.
ఎక్కడెక్కడ వేస్తారంటే...
కాకినాడ, రాజమహేంద్రవరం, పెద్దాపురం, రామచంద్రపురం ఆస్పత్రుల పోస్ట్ పోర్టమ్ యూనిట్ల్లో (పీపీయూ), పండూరు, అయినవిల్లి, కేశనకుర్రు, లక్కవరం, కరప, పెద్దాడ, ఏవీ నగరం, కోటనందూరు, కోరుకొండ, గొల్లపాలెం, పామర్రు, బిక్కవోలు, అడ్డతీగల, ఏడుగురాళ్లపల్లి, రాజానగరం, జి.కొత్తపల్లి, సీతానగరం పీహెచ్సీలు, కొత్తపేట, చింతూరు, రాజోలు, పిఠాపురం, జగ్గంపేట, ఏలేశ్వరం, అనపర్తి సీహెచ్సీలు, రాజమహేంద్రవరంలోని నారాయణపురం, కాకినాడ కొండయ్యపాలెం యూహెచ్సీలు, రంపచోడవరం, అమలాపురం ఏరియా ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ ఉచితంగా వేస్తారు. ఆరోగ్యశ్రీకి అనుబంధంగా ఉన్న కాకినాడ అపోలో, ఇనోదయ, సంజీవిని, అమలాపురం కిమ్స్, రాజమహేంద్రవరం జీఎస్ఎల్, కమలాకర్, కిమ్స్, సాయి ఆసుపత్రుల్లో రూ.250 తీసుకుని వ్యాక్సిన్ వేస్తారు.