ఆవు పేడను దొంగతనం చేశారట.. పోలీస్ స్టేషన్లో కేసు నమోదు..!

ABN , First Publish Date - 2021-06-21T18:39:02+05:30 IST

‘అయ్యయ్యో.. నా ఆవు పేడను ఎవరో ఎత్తుకెళ్లారు. కష్టపడి కూడబెట్టిన పేడనంతా రాత్రికి రాత్రే ఎవరో దొంగతనం చేశారు. నా ఆవు పేడను నాకు తిరిగి ఇప్పించండి. దాన్ని ఎవరు దొంగతనం చేశారో తేల్చండి’ అంటూ ఓ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఆవు పేడను దొంగతనం చేశారట.. పోలీస్ స్టేషన్లో కేసు నమోదు..!

‘అయ్యయ్యో.. నా ఆవు పేడను ఎవరో ఎత్తుకెళ్లారు. కష్టపడి కూడబెట్టిన పేడనంతా రాత్రికి రాత్రే ఎవరో దొంగతనం చేశారు. నా ఆవు పేడను నాకు తిరిగి ఇప్పించండి. దాన్ని ఎవరు దొంగతనం చేశారో తేల్చండి’ అంటూ ఓ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఏంటీ, ఆవు పేడ పోతే కేసు పెట్టడం ఏంటీ.? అని ఆశ్చర్యపోతున్నారా.? ఇది వట్టి పుకారేనని అనుకుంటున్నారా..? కాదు.. ఇది నిజంగానే జరిగింది. ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని కోబ్రా జిల్లాలో ధూరెనా గ్రామంలో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..


‘గోధన్ న్యాయ్ యోజన’ పథకం కింద కిలోకు రెండు రూపాయలు చొప్పున ఆవు పేడను కొంటామంటూ ఇటీవల ఛత్తీస్‌ఘడ్ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో గ్రామాల్లో పెద్ద సంఖ్యలో ఆవులను కలిగి ఉన్నవాళ్లు పేడను పోగు చేయడం, దాన్ని అమ్మడం మొదలు పెట్టారు. ధూరేనా గ్రామంలో కూడా ఓ రైతు ఏకంగా 800 కిలోల ఆవు పేడను సేకరించాడు. దాన్ని పిడకలుగా మార్చి కుప్పగా పోశాడు. అయితే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆ 800 కిలోల పిడకలను ఎత్తుకెళ్లారు. దీంతో బాధితుడు ఈ ఘటనపై జూన్ 15వ తారీఖున దిప్కా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పిడకలను ఎత్తుకెళ్లిన వాళ్లు ఎవరో తేల్చాలనీ, తనకు న్యాయం చేయాలని ఆ బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇది కాస్తా ఆలస్యంగా వెలుగులోకి రావడంతో చర్చనీయాంశంగా మారింది. కాగా, ఈ ఘటనపై కేసును నమోదు చేసుకున్నామని దిప్కా పోలీస్ స్టేషన్ ఎస్సై సురేష్ కుమా వెల్లడించారు. దాదాపు 1600 రూపాయల విలువైన ఆవు పిడకలను జూన్ 8 లేదా 9వ తారీఖుల్లో ఎత్తుకెళ్లి ఉంటారనీ, నిందితుల కోసం గాలిస్తున్నామని ఆయన వెల్లడించారు. 



Updated Date - 2021-06-21T18:39:02+05:30 IST