గోవును జాతీయప్రాణిగా ప్రకటించాలి

ABN , First Publish Date - 2022-08-19T07:08:26+05:30 IST

గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని కోరుతూ ఓ భక్త బృందం హైదరాబాదు నుంచి చేపట్టిన పాదయాత్ర తిరుమలకు చేరుకుంది.

గోవును జాతీయప్రాణిగా ప్రకటించాలి

హైదరాబాదు నుంచి తిరుమలకు చేరుకున్న ‘గో మహా పాదయాత్ర’


తిరుమల, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని కోరుతూ ఓ భక్త బృందం హైదరాబాదు నుంచి చేపట్టిన పాదయాత్ర తిరుమలకు చేరుకుంది. అఖిలభారత గోసేవ ఫౌండేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు బాలకృష్ణ గురుస్వామి ఆధ్వర్యంలో దాదాపు 40మంది భక్తులు జూలై 31వ తేదీన ‘గో మహా పాదయాత్ర’ పేరుతో హైదరాబాదులోని హిమాయత్‌నగర్‌ నుంచి తిరుమలకు బయల్దేరారు. రెండు గోవులను ఓ వాహనంలో ఎక్కించుకుని దాదాపు 565 కిలోమీటర్ల దూరం నడుస్తూ.. మార్గమధ్యంలో దేవాలయాల వద్ద గోమాతలను దించి పూజలు నిర్వహిస్తూ వచ్చారు. గురువారం మధ్యాహ్నానికి తిరుమల చేరుకున్నారు. జీఎన్సీ టోల్‌గేటు వద్ద కూడా గోమాతలను వాహనంలో నుంచి దించి కొన్ని మెట్లపై నడిపించారు. సాయంత్రం శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణస్వామి మీడియాతో మాట్లాడుతూ.. గోవును జాతీయప్రాణిగా ప్రకటించాలంటూ టీటీడీ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రం అమలుచేయాలనే నినాదంతో పాదయాత్రగా వచ్చామన్నారు. గోమాతలు బాగుంటేనే అందరం సుభిక్షంగా ఉంటామన్నారు. ఈ విషయంలో మోదీతో పాటు అన్ని రాష్ర్టాల నాయకులు ఓసారి ఆలోచించాలన్నారు. గోఆధారిత వ్యవసాయం లేకపోవడంతో విషపూరితమైన ఆహారం తింటున్నామని, దీంతో మన పిల్లల జీవితకాలం 30, 40 ఏళ్లకు తగ్గిపోతుందని అభిప్రాయపడ్డారు. తమతోపాటు తీసుకొచ్చిన రెండు గోవులను టీటీడీకి అందజేస్తామన్నారు. 

Updated Date - 2022-08-19T07:08:26+05:30 IST