సోమవారం నుంచి ‘కొ-విన్’ రిజిస్ట్రేషన్లు షురూ.. ఎలా చేసుకోవాలంటే?

ABN , First Publish Date - 2021-02-28T22:44:11+05:30 IST

కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు దేశవ్యాప్తంగా చేపట్టిన వ్యాక్సినేషన్ తొలి దశ కార్యక్రమం చురుగ్గా

సోమవారం నుంచి ‘కొ-విన్’ రిజిస్ట్రేషన్లు షురూ.. ఎలా చేసుకోవాలంటే?

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు దేశవ్యాప్తంగా చేపట్టిన వ్యాక్సినేషన్ తొలి దశ కార్యక్రమం చురుగ్గా కొనసాగుతోంది. ఈ దశలో 27 కోట్ల మంది హెల్త్‌కేర్, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు టీకాలు వేయనున్నారు. వ్యాక్సినేషన్ కార్యక్రమం లక్ష్యం దిశగా సాగుతుండగా, త్వరలో రెండో దశ వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభం కానుంది. ఈ దశలో వృద్ధులకు టీకాలు వేయనున్నారు. ఇందు కోసం రేపటి (మార్చి 1) నుంచి  ‘కొ-విన్’ డిజిటల్ ప్లాట్‌పామ్‌లో వృద్ధులు తమ పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. 


ఆయుష్మాన్ భారత్-పీఎంజేఏవై కింద ఎంపానెల్ చేసిన 10 వేల ఆసుపత్రులు, కేంద్రప్రభుత్వం ఆరోగ్య పథకం (సీజీహెచ్ఎస్) కింద 687 ఆసుపత్రులను కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్లు (సీవీసీలు)గా రాష్ట్ర ప్రభుత్వాలు ఉపయోగించుకోవచ్చు. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య బీమా పథకం కింద ఎంపానెల్ చేసిన అన్ని ప్రైవేటు ఆసుపత్రులను సీవీసీలుగా ఉపయోగించుకునే స్వేచ్ఛను రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చింది.


కొ-విన్‌లో రిజిస్ట్రేషన్ ఇలా.. 


1.  60 ఏళ్లు పైబడినవారు, 45 ఏళ్లు నిండి కోమోర్బిడిటీస్‌తో బాధపడేవారు ఈ దశలో టీకా తీసుకునేందుకు అర్హులు. వీరంతా సోమవారం నుంచి కొ-విన్ ప్లాట్‌ఫామ్‌లో తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవచ్చు. 


2: సెషన్ సైట్స్ వద్దకు నేరుగా వెళ్లి కూడా తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవచ్చు. 


3: ప్రభుత్వ ఆసుపత్రుల్లో వేసే టీకా పూర్తిగా ఉచితం. ప్రైవేటు హెల్త్ ఫెసిలిటీలలో మాత్రం కొంత ధర చెల్లించి వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. అన్ని ప్రైవేటు ఆసుపత్రులలో వ్యాక్సిన్‌కు రూ. 150, సర్వీసు చార్జీ కింద రూ. 100 చెల్లించి టీకా వేసుకోవచ్చు. 


4. కొ-విన్ పోర్టల్‌లో పేర్లు నమోదు చేయించుకున్న వారికి వారి లొకేషన్ల ఆధారంగా వ్యాక్సిన్ ఫెసిలిటీ కేంద్రం స్లాట్‌ను కేటాయిస్తుంది. 


 5. కొ-విన్ ప్లాట్‌ఫామ్ కొత్త వెర్షన్ జీపీఎస్‌తో అనుసంధానమై ఉంటుంది. లబ్ధిదారులు ప్రభుత్వం, ప్రైవేటు టీకా కేంద్రాల్లో ఏదో ఒకదానిని ఎంచుకోవచ్చు.  


6. సెషన్ సైట్స్ వద్దకు వెళ్లి నేరుగా పేరు నమోదు చేయించుకునే వారికి సాయం చేసేందుకు వలంటీర్లు అందుబాటులో ఉంటారు.  


7. లబ్ధిదారుడు వేరే రాష్ట్రంలోనూ టీకా వేయించుకునే వెసులుబాటు కూడా ఉంది. 


8. 45 ఏళ్లు నిండి కోమోర్బిడిటీస్‌తో బాధపడేవారు తమ మెడికల్ సర్టిఫికెట్‌ను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే, కోమోర్బిడిటీస్ కేటగిరీ కిందికి వచ్చే వ్యాధులను కేంద్రం వర్గీకరించాల్సి ఉంటుంది. 


9. లబ్ధిదారులు తమ మొబైల్ నంబరు ద్వారా తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవచ్చు. పేరు రిజస్టర్ చేయించుకున్న వెంటనే ఇచ్చిన మొబైల్ నంబరుకు ఓటీపీ వస్తుంది. ఒక వ్యక్తి తమ కుటుంబ సభ్యులకు పేర్లను కూడా నమోదు చేయవచ్చు. 


10: ఆరోగ్య సేతు, ఇతర యాప్స్ నుంచి కూడా వ్యాక్సిన్ కోసం పేర్లను నమోదు చేసుకోవచ్చు. అయితే, ఈ దశలో  సీనియర్ సిటిజన్లు, 45 ఏళ్లు దాటి కోమోర్బిడిటీస్‌తో బాధపడుతున్న వారికి మాత్రమే టీకాలు వేస్తారు. 

Updated Date - 2021-02-28T22:44:11+05:30 IST