లక్ష్మణ్‌ కుటుంబానికి అండగా ఉంటాం : సీపీ అంజనీకుమార్‌

ABN , First Publish Date - 2021-05-11T14:15:07+05:30 IST

ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన సుల్తాన్‌బజార్‌ అడిషనల్‌ ఇన్‌స్పెక్టర్‌

లక్ష్మణ్‌ కుటుంబానికి అండగా ఉంటాం : సీపీ అంజనీకుమార్‌

  • సుల్తాన్‌ బజార్‌ పోలీస్‌ స్టేషన్‌లో డీఐ లక్ష్మణ్‌, ఝాన్సీల సంతాప సభ
  • జూమ్‌ యాప్‌ ద్వారా కుటుంబ సభ్యులతో మాట్లాడిన సీపీ, అడిషనల్‌ సీపీలు 

హైదరాబాద్/మంగళ్‌హాట్‌ : ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన సుల్తాన్‌బజార్‌ అడిషనల్‌ ఇన్‌స్పెక్టర్‌ లక్ష్మణ్‌ కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని నగర కమిషనర్‌ అంజనీకుమార్‌ హామీ ఇచ్చారు. సోమవారం సుల్తాన్‌బజార్‌ పోలీస్‌స్టేషన్‌లో డీఐ లక్ష్మణ్‌, ఆయన సతీమణి ఝాన్సీల సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా జూమ్‌ యాప్‌ ద్వారా పాల్గొన్న సీపీ అంజనీకుమార్‌, అడిషనల్‌ సీపీ రమే్‌షరెడ్డి మాట్లాడారు. లక్ష్మణ్‌ కుమారుడు సహాస్‌(7), కూతురు ఆకాంక్ష(9)లతో జూమ్‌లో మాట్లాడిన సీపీకి సహాస్‌ పెద్దయ్యాక పోలీస్‌ అవుతానని, ఆకాంక్ష డాక్టర్‌ అవుతానని చెప్పడంతో అందుకు అవసరమైన సహకారం అందిస్తామని చెప్పారు. అనంతరం అడిషనల్‌ సీపీ రమేష్‌రెడ్డి మాట్లాడుతూ ఎలాంటి సహకారం కావాలన్నా తాము అండగా ఉంటామన్నారు. మృతుడు లక్ష్మణ్‌ బ్యాచ్‌మెట్స్‌ కూడా తమ అండదండలు ఎల్లప్పుడూ ఉంటాయని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఏసీపీ దేవేందర్‌, సుల్తాన్‌బజార్‌ ఇన్‌స్పెక్టర్‌ సుబ్బరామిరెడ్డి, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-05-11T14:15:07+05:30 IST