మహిళా అధికారులను చూసి గర్వపడుతున్నా: సీపీ ఆనంద్

ABN , First Publish Date - 2022-03-08T17:34:58+05:30 IST

నగర పోలీసుల ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

మహిళా అధికారులను చూసి గర్వపడుతున్నా: సీపీ ఆనంద్

హైదరాబాద్: నగర పోలీసుల ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. హోం మంత్రి మహమ్మద్ అలీ, సీపీ సీవీ ఆనంద్, అడిషనల్ సీపీ సిట్ ఏఆర్ శ్రీనివాస్, డీసీపీ చందనా దీప్తి వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీపీ ఆనంద్ మాట్లాడుతూ మహిళా అధికారులను చూసి గర్వపడుతున్నానన్నారు. అన్ని రంగాల్లో మహిళల పాత్ర పెరుగుతోందని తెలిపారు. యుద్ధరంగంలో కూడా మహిళలు పాల్గొనే స్థాయికి ఎదిగారని అన్నారు. మహిళల పాత్ర గురించి సినిమాల్లో బాగా చూపిస్తున్నారని... ఈమధ్య కాలంలో మహిళల ప్రాధాన్యతపై మంచి సినిమాలు వచ్చాయన్నారు.


సినిమాలు చూసి చాలా మంది మహిళలు ఇన్స్‌పైర్ అయి పోలీస్ యూనిఫామ్ వేసుకుంటున్నారని ఆయన తెలిపారు. పోలీస్ విధులు కత్తిమీద సాము లాంటిదన్నారు. మహిళలకు కుటుంబ పరంగా అందించే అన్ని సహకారాలు డిపార్ట్‌మెంట్‌లో అందించాలనేది తన ఆలోచన అని తెలిపారు. మహిళలు జీడీపీలో కూడా భాగం పంచుకుంటున్నారని చెప్పారు. స్వతంత్ర హక్కులు మహిళలకు కల్పించాలన్నారు. రాష్ట్రంలో 700 పోలీస్ స్టేషన్‌లు ఉంటే మూడింటిలో మాత్రమే మహిళా ఎస్‌హెచ్‌వోలు ఉన్నారని చెప్పారు. 170 సంవత్సరాలు చరిత్ర ఉన్న హైదరాబాద్ పోలీస్ విభాగంలో మహిళా ఎస్ఎచ్ఓలు లేరని... దీంతో మొట్టమొదటి మహిళ ఎస్ఎచ్ఓను లాలగూడా పీఎస్‌లో నియమించామని సీపీ తెలిపారు.


పోలీసు స్టేషన్‌లో కేవలం 60 శాతం మాత్రమే మహిళలకు ప్రత్యేక సదుపాయాలు ఉన్నాయన్నారు. రాష్ట్ర విభజనకు ముందు 20 శాతం ఉంటే విభజన అనంతరం పరిస్థితులు మెరుగు పడ్డాయని చెప్పారు. పని ప్రదేశంలో అసమానతలు ఉండకుండా ఉండాలన్నారు. దేశంలో ప్రతి ఎయిర్ పోర్ట్‌లో సీఐఎస్‌ఎఫ్ మహిళా అధికారులు సంఖ్య ఎక్కువగా ఉంటోందని అన్నారు. సీఐఎస్‌ఎఫ్ మహిళా పోలీస్ అధికారులను స్ఫూర్తిగా తీసుకుని... ఆకాశమే హద్దుగా ముందుకు వెళ్ళాలని సీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. 

Updated Date - 2022-03-08T17:34:58+05:30 IST