ఎస్‌బీపై సీపీ సీరియస్‌

ABN , First Publish Date - 2021-11-11T06:26:17+05:30 IST

సీఎస్‌బీ (సిటీ స్పెషల్‌ బ్రాంచ్‌) సిబ్బందిపై పోలీస్‌ కమిషనర్‌ బి.శ్రీనివాసులు సీరియస్‌ అయినట్టు తెలిసింది.

ఎస్‌బీపై సీపీ సీరియస్‌

విజయవాడ, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి) : సీఎస్‌బీ (సిటీ స్పెషల్‌ బ్రాంచ్‌) సిబ్బందిపై పోలీస్‌ కమిషనర్‌ బి.శ్రీనివాసులు సీరియస్‌ అయినట్టు తెలిసింది. ఎంజీ రోడ్డులో రహదారులు, భవనాల శాఖ కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహిస్తుండగా, వివిధ విద్యార్థి సంఘాల నాయకులు లోనికి వచ్చి, మంత్రిని చుట్టిముట్టిన విషయం తెలిసిందే. విద్యార్థులు లోపలకు ప్రవేశించే వరకు పోలీసులకు సమాచారం తెలియలేదు. కార్యాలయ ప్రధాన ద్వారం వద్ద పోలీసులు ఉన్నప్పటికీ వారిని నిలువరించలేకపోయారు. సాధారణంగా స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు ఆయా స్టేషన్ల పరిధిలో ఏమి జరుగుతున్నా ముందుగానే సమాచారం సేకరించి ఉన్నతాధికారులకు పంపుతారు. ఏ స్టేషన్‌ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలు చోటుచేసుకుంటున్నా వీరు నిఘా పెట్టాలి. రాజకీయ నేతలు, వారి అనుచరుల కదలికలపై ఒక కన్నేసి ఉంచాలి. వారి కార్యక్రమాల వివరాలు సేకరించాలి. విద్యార్థి సంఘాలు బుధవారం రహదారుల, భవనాల శాఖ కార్యాలయం వద్దకు వస్తారన్న సమాచారం ఎస్‌బీ సిబ్బందికి తెలియలేదు. దీంతో పోలీసులు ఎటువంటి ముందస్తు జాగ్రత్తలూ తీసుకోలేదు. దీంతో ఆందోళనకారులు నేరుగా లోనికి వచ్చి, మంత్రిని చుట్టుముట్టారు. ఈ ఘటనపై పోలీస్‌ కమిషనర్‌ బత్తిన శ్రీనివాసులు తీవ్రంగా స్పందించారు. సంబంధిత స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులకు గట్టిగా క్లాస్‌ తీసుకున్నారని సమాచారం. 

Updated Date - 2021-11-11T06:26:17+05:30 IST