ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్పరం చేయనివ్వం
ABN , First Publish Date - 2020-11-27T05:28:36+05:30 IST
ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలను అడ్డుకుని తీరుతామని సీపీఎం నాయకులు స్పష్టం చేశారు.
సార్వత్రిక సమ్మెలో నేతలు
సీపీఎం రాస్తారోఖో, సీఐటీయూ నిరసన ప్రదర్శన
నెల్లూరు (వైద్యం/రూరల్), నవంబరు 26 : ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలను అడ్డుకుని తీరుతామని సీపీఎం నాయకులు స్పష్టం చేశారు. గురువారం దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా నెల్లూరు - తాటిపర్తి రహదారిపై జొన్నవాడ సర్కిల్ వద్ద రాస్తోరోఖో నిర్వహించారు. పార్టీ మండల కార్యదర్శి ఆలూరు తిరుపాలు మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ వల్ల కార్మికులు హక్కులను కోల్పోతారన్నారు. పైగా దేశ ఖజనాకు రావాల్సిన ఆదాయం ప్రైవేట్ వ్యక్తుల జేబుల్లోకి వెళ్తుందన్నారు. కరోనా విపత్తుతో నష్టపోయిన పేదలు, నిరుపేదలకు కనీస పరిహారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు ముత్యాల నాగయ్య, భాస్కర్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.
సార్వత్రిక సమ్మెలో భాగంగా గురువారం సీఐటీయూ ఆధ్వర్యంలో నెల్లూరులోని ఆర్టీసీ బస్టాండ్ నుంచి వీఆర్సీ సెంటర్ వరకు నిరసన ప్రదర్శన జరిగింది. వర్షంలోనూ ర్యాలీ కొనసాగింది. నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు మాదాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్మిక, ప్రజా, రైతాంగ వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని విమర్శించారు. కరోనా సమయంలో వలస కార్మికులను అనాఽథలుగా మార్చిందని, ఉపాధి హామీ పథకం కింద రెండు కోట్లమందికి జాబ్ కార్డులు ఇవ్వకుండా కేంద్రం మొండిచేయి చూపుతోందన్నారు. సీఐటీయూ రూరల్ అధ్యక్ష, కార్యదర్శులు కొండా ప్రసాద్, అల్లాడి గోపాల్, షాహినాబేగం మాట్లాడుతూ కేంద్రం తెచ్చిన కార్మిక, రైతాంగ వ్యతిరేక చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ కార్యనిర్వహక అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, నాయకులు కిన్నెర కుమార్, సుధాకర్, కట్టా సుబ్రహ్మణ్యం, సంపత్ కుమార్, జిలానీబాషా, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.