కర్నూలులో ‘జైభీం’ సీన్!
ABN , First Publish Date - 2022-03-14T08:28:08+05:30 IST
‘‘కర్నూలు జిల్లా ఆస్పరి పోలీస్ స్టేషన్లో ‘జై భీం’ సీన్ రిపీట్ అయింది. న్యాయం కోరి స్టేషన్కు వచ్చిన వారిని పోలీసులు చితకబాదారు. వారితరఫున స్టేషన్కువెళ్లి.. ఇదేం న్యాయమని ప్రశ్నించిన సీపీఐ నేతను కూడా చితకబాదడమే
- కుంటి నాకొడకా.. మమ్మల్నే ప్రశ్నిస్తావా?..
- అంటూ సీపీఐ నేతపై పోలీసుల దాడి
- దుస్తులు విప్పి.. చితకబాదిన వైనం
- ఎస్ఐ, కానిస్టేబుల్ సస్పెన్షన్కు సీపీఐ డిమాండ్
ఆదోని, మార్చి 13: ‘‘కర్నూలు జిల్లా ఆస్పరి పోలీస్ స్టేషన్లో ‘జై భీం’ సీన్ రిపీట్ అయింది. న్యాయం కోరి స్టేషన్కు వచ్చిన వారిని పోలీసులు చితకబాదారు. వారితరఫున స్టేషన్కువెళ్లి.. ఇదేం న్యాయమని ప్రశ్నించిన సీపీఐ నేతను కూడా చితకబాదడమే కాకుండా.. ఎదురు కేసులు పెట్టి బట్టలూడదీయించి నడిరోడ్డుపై నడిపించుకుంటూ తీసుకెళ్లారు’’ అని స్థానిక సీపీఐ నేతలు పోలీసులపై ఆరోపించారు. బాధితుడు తెలిపిన వివరాల మేరకు.. సీపీఐ మండల కార్యదర్శి విరూపాక్షి శనివారం ఓ కేసు విషయమై ఆస్పరి పోలీస్ స్టేషన్కు వెళ్లారు. న్యాయం కోసం పోలీస్ స్టేషన్కు వచ్చిన బాధితులను ఎందుకు కొట్టారని ఎస్ఐని ప్రశ్నించారు.
దీంతో పక్కనే ఉన్న కానిస్టేబుల్ రామకృష్ణ.. ‘కుంటి నాకొడకా ఎస్ఐనే ప్రశ్నిస్తావా?’ అంటూ విరూపాక్షిపై లాఠీతో విరుచుకుపడ్డాడు. ఎస్ఐ మునిప్రతాప్ స్పందించి తమ కానిస్టేబుల్కు మానసిక స్థితి సరిగా లేదని సర్ది చెప్పి విరూపాక్షిని అక్కడి నుంచి పంపించారు. అయితే, శనివారం అర్ధరాత్రి ఎస్ఐ మునిప్రతాప్, నలుగురు కానిస్టేబుళ్లను తీసుకుని కైరుప్పల గ్రామంలో ఉన్న విరుపాక్షి ఇంటికి వెళ్లారు. ‘నీ మీద కేసు ఉంది. డీఎస్పీ పిలుస్తున్నారు. పోలీస్ స్టేషన్కు రావాల’ని గద్దించాడు. ఇంట్లో ఉన్న బియ్యం, కంది పప్పు, బట్టలను చిందరవందర చేసి విరూపాక్షి కుటుంబసభ్యులను భయభ్రాంతులకు గురి చేశారు. ఈ క్రమంలో.. తాను తెల్లవారి వస్తానని విరూపాక్షి అనడంతో రెచ్చిపోయిన పోలీసులు.. కుటుంబ సభ్యుల ముందే.. ఆయనను చితకబాదారు.
అడ్డుపడిన తల్లి ఈరమ్మ, చిన్నమ్మ నరసమ్మ, భార్య లావణ్య పట్ల కూడా దురుసుగా ప్రవర్తించారు. విరూపాక్షి దుస్తులను ఊడదీయించి, వీధుల గుండా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. విషయం తెలిసి కొందరు స్థానికులు అడ్డుకోవడంతో పోలీసులు విరూపాక్షిని వదిలేసి వెళ్లిపోయారు. కాగా, పోలీసులపై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నట్టు విరూపాక్షి తెలిపారు. విరూపాక్షే.. కానిస్టేబుల్ చొక్కా పట్టుకున్నాడని.. అందుకే కేసు నమోదు చేశామని ఎస్ఐ మునిప్రతాప్ తెలిపారు. కాగా.. సీపీఐ నేతపై అకారణంగా దాడి చేసి, దుస్తులు విప్పించిన ఎస్ఐ మునిప్రతాప్, కానిస్టేబుల్ రామకృష్ణను తక్షణమే సస్పెండ్ చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బి. గిడ్డయ్య డిమాండ్ చేశారు. ఈ ఘటనను రాష్ట్ర, జిల్లా స్థాయి పోలీస్ అధికారుల దృష్టికి తీసుకెళ్తామని, హైకోర్టులో ప్రైవేటు కేసు వేస్తామని హెచ్చరించారు.