ఎవరు అడ్డం వస్తే వాళ్లను చంపేస్తున్నారు... వైఎస్ను కూడా ఏం చేసేవారో?: Narayana
ABN , First Publish Date - 2022-02-17T18:26:21+05:30 IST
రాష్ట్రంలో భయంకరమైన వాతావరణం ఏర్పడుతోందని సీపీఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అనంతపురం: రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై సీపీఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో భయంకరమైన వాతావరణం ఏర్పడుతోందని అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ...కోల్డ్ మర్డర్ వ్యవస్థ ఏపీలో ఉందని.. ఇది అత్యంత ప్రమాదకరమైన అంశమన్నారు. వైఎస్ వివేకా హత్యపై రాష్ట్రంలో చర్చ జరుగుతోందని తెలిపారు. ఏకంగా సీబీఐపైనే సుప్రీంకోర్టుకు వెళ్తానని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి అంటున్నారన్నారు.
వైఎస్ వివేకాను ఎవరు హత్య చేశారన్నది కోర్టులో వివాదం నడుస్తోందని తెలిపారు. రాష్ట్రంలో ఎవరు అడ్డం వస్తే వాళ్ళని చంపేస్తున్నారని... వైఎస్ రాజశేఖర్ రెడ్డి అడ్డం ఉంటే ఆయనను కూడా ఏం చేసేవారో అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను ఉధ్దేశించి ఆయన పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారు. అంత అనుమానంతో కూడిన రాజకీయ పరిస్థితులు రాష్ట్రంలో వచ్చాయన్నారు. ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే సీబీఐను సపోర్ట్ చేస్తారు లేకుంటే వ్యతిరేకిస్తారని నారాయణ అన్నారు.