నెల్లూరు కోర్టులో చోరీ న్యాయవ్యవస్థకే మాయని మచ్చ: Ramakrishna
ABN , First Publish Date - 2022-04-16T15:27:27+05:30 IST
నెల్లూరు కోర్టులో చోరీ న్యాయవ్యవస్థకే మాయని మచ్చ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు.
అమరావతి: నెల్లూరు కోర్టులో చోరీ న్యాయవ్యవస్థకే మాయని మచ్చ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రధాన నిందితుడుగా ఉన్న ఫోర్జరీ పత్రాల కేసులో ఆధారాలను నెల్లూరు కోర్టు నుండి ఎత్తుకుపోవడం దుర్మార్గమన్నారు. మంత్రిగా కాకాణికి శిక్ష పడుతుందనే సాక్ష్యాల దొంగతనం జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయని తెలిపారు. నెల్లూరు కోర్టు లాకర్లో ఉన్న సాక్ష్యాల దొంగతనం న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని వమ్ము చేసేలా ఉందన్నారు. తక్షణమే నిందితుల బెయిల్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నెల్లూరు కోర్టులో చోరీ కేసును హైకోర్టు సుమోటోగా స్వీకరించి సిట్టింగ్ జడ్జి చేత సమగ్ర విచారణ జరపాలన్నారు. ఇందుకు కారకులైన వారిపై కఠిన చర్యలు చేపట్టి, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.