మోదీ, అమిత్ షా తలుచుకుంటే జగన్కు శుక్రవారం దాటదు: Ramakrishna
ABN , First Publish Date - 2022-06-10T16:41:41+05:30 IST
రాష్ట్రంలో జగన్ సర్కార్పై సీపీఐ నేత రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు.
విశాఖపట్నం: రాష్ట్రంలో జగన్ (Jagan) సర్కార్పై సీపీఐ నేత రామకృష్ణ (Ramakrishna) సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra modi), కేంద్ర మంత్రి అమిత్ షా (Amit shah) తలుచుకుంటే జగన్కు శుక్రవారం దాటదన్నారు. జగన్కు కేంద్రం సహకారం ఉందని, లేదంటే మొదటి వారంలోనే సీఎం ఆఫీస్ క్లోస్ అవుతుందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర బీజేపీతో వైసీపీ గుద్దులు... కేంద్రంతో ముద్దులు అని అన్నారు. జగన్ సర్కార్ దివాళా తీసిందని అన్నారు. రాష్ట్రానికి 3 ఏళ్ల కాలంలో అప్పులు తప్ప.. అభివృద్ధి చేయలేదని మండిపడ్డారు. జగన్ దిగేనాటికీ 10 లక్షల కోట్లు అప్పు చేస్తారన్నారు. పోలవరం ప్రాజెక్టును గాలికి వదిలేశారని, ఎప్పుడు పూర్తి చేశారో చెప్పలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు.
ప్రజలకు ఏమి చేయని జగన్... 175 సీట్లు ఎలా వస్తాయని అనుకుంటున్నారని ప్రశ్నించారు. పదవ తరగతి ఫలితాల శాతం తగ్గడానికి... జగన్ సర్కార్ వైఖరే కారణమని దుయ్యబట్టారు. రాష్ట్రంలో క్రాప్ హాలిడే పరిస్థితులు వచ్చినందుకు జగన్ సర్కార్ సిగ్గుపడాలన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి వైసీపీ 100 శాతం మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. జనసేన బీజేపీతో ఉంటానంటోందని.. బీజేపీ మాత్రం జగన్తోనే ఉందన్నారు. పవన్ కల్యాణ్ తన పంథా ఏంటో చెప్పాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.