ఏపీ రాజధానిపై విద్యార్థుల్లో గందరగోళం తగదు: Ramakrishna
ABN , First Publish Date - 2022-02-11T16:57:22+05:30 IST
ఏపీ రాజధాని అంశంపై విద్యార్థుల్లో గందరగోళం సృష్టించడం తగదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు.
అమరావతి: ఏపీ రాజధాని అంశంపై విద్యార్థుల్లో గందరగోళం సృష్టించడం తగదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. 4వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని పేరు ఇవ్వకపోవటం దుర్మార్గమన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదనేది పరీక్షల్లో ప్రశ్నగా వస్తే విద్యార్థులు ఏం జవాబు రాయాలని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం అమరావతినే రాజధానిగా గుర్తించినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించకపోవడం విచారకరమని ఆయన అన్నారు.
దేశ చరిత్రలో రాజధానిలేని రాష్ట్రంగా ఏపీని చేసిన ఏకైక ప్రభుత్వం జగన్ సర్కారే అని మండిపడ్డారు. అమరావతి రాజధాని ప్రాంత భూములను తాకట్టుపెట్టడంలో ఉన్న శ్రద్ధ, విద్యార్థుల పాఠ్యపుస్తకాల్లో ముద్రించడంలో లేదెందుకని నిలదీశారు. అమరావతి రాజధాని విషయంలో రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను పరిగణలోకి తీసుకోకుండా వ్యవహరించటం ప్రభుత్వానికి మంచిది కాదన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమరావతినే ఏపీ రాజధానిగా స్పష్టమైన ప్రకటన చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.