ప్రజలపై పన్ను భారాలొద్దు
ABN , First Publish Date - 2020-12-03T04:40:59+05:30 IST
పట్టణ ప్రజలపై అధిక పన్ను భారా లు మోపే జీవో 196, 197 ఉపసంహరించుకోవాలని సీపీఎం నగర కార్యదర్శి పి.కిషోర్ డిమాండ్ చేశారు.
నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద సీపీఎం ధర్నా
ఏలూరు ఫైర్స్టేషన్, డిసెంబరు 2 : పట్టణ ప్రజలపై అధిక పన్ను భారా లు మోపే జీవో 196, 197 ఉపసంహరించుకోవాలని సీపీఎం నగర కార్యదర్శి పి.కిషోర్ డిమాండ్ చేశారు. నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చెప్పినట్టు రాష్ట్ర ప్రభుత్వం తల ఊపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం తెచ్చిన మునిసిపల్ సంస్కరణల్లో భాగంగా రాష్ట్రంలోనూ పన్నులు పెంచుతూ జీవోలు తేవడం దుర్మార్గమన్నారు. 1955 మునిసిపల్ చట్టంలో మార్పులు చేశారన్నారు. అప్పటి చట్టంలో ఇంటి పన్నులు అద్దె విలువ ప్రాతిపదిక నిర్ణయించేవారన్నారు. నేడు అద్దె విలువ బదులుగా ఆస్తి విలువతో పన్నులు వేసే విధానాన్ని తీసుకొచ్చారన్నారు. ఇలా అయితే ఇప్పుడు ఉన్న పన్నుల కంటే మూడు వందల రెట్లు అధికంగా పెరిగే అవకాశం ఉందన్నారు. ఇది నగర ప్రజలు, వ్యాపారులపై పెనుభారమన్నారు. ఇంటి పన్నుతో పాటు మంచినీరు, డ్రెయినేజీ పన్నులు పెంచిన జీవోలను రద్దు చేయాలన్నారు. కరోనా సమయంలో పన్నులు పెంచడం ఎంత వరకూ సబబని ప్రశ్నించారు. పన్నులు పెంచుతూ ఇచ్చిన జీవోను ఉపసంహరించు కోకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బి.సోమయ్య, బి.జగన్నాఽథరావు, బి.సాయిబాబు, పి.ఆదిశేషు, ఎ.శ్యామలరాణి, ఎ.విజయలక్ష్మి, రవీంద్ర, సత్తిరాజు, పాల్గొన్నారు.